South India: సింహళీయులు మనోళ్లే
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:10 AM
శ్రీలంకలో నివసించే సింహళీయుల జన్యు మూలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి పూర్వీకులకు దక్షిణ భారతదేశంలో నివసించే ద్రవిడులతో సంబంధం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.....

దక్షిణాది నుంచి వేల ఏళ్ల క్రితం శ్రీలంకకు వలస
చెన్నై, జూలై 3: శ్రీలంకలో నివసించే సింహళీయుల జన్యు మూలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి పూర్వీకులకు దక్షిణ భారతదేశంలో నివసించే ద్రవిడులతో సంబంధం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధన వివరాలు ‘కరెంట్ బయాలజీ’ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి. స్థానికంగా నివసించే రెండు ఆదివాసీ తెగలకు చెందినవారి జన్యువులు, సింహళీయుల జన్యువులు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం 35 మంది పట్టణ ప్రాంత సింహళీయులతో పాటు రెండు విభిన్నమైన భౌగోళిక ప్రాంతాలకు చెందిన 19 మంది ఆదివాసీల జన్యు నమూనాలను పరీక్షించారు. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం సింహళీయుల పూర్వీకులు ఉత్తర, వాయవ్య భారతదేశం నుంచి శ్రీలంకకు వలస వెళ్లారని మునుపటి అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుత పరిశోధన ఫలితాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి.
సింహళీయులు, ఆదివాసీల పూర్వీకుల జన్యు నిష్పత్తులు ప్రస్తుతం దక్షిణాదిన నివసిస్తున్న ద్రవిడ భాష మాట్లాడే ప్రజలతో చాలావరకూ పోలి ఉన్నట్లు గుర్తించామని పరిశోధకుల్లో ఒకరైన లఖ్నవూలోని బార్బల్ సాహ్ని ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ పాలియోసైన్సెస్(బీఎస్ఐపీ)కి చెందిన డాక్టర్ నీరజ్రాయ్ వివరించారు. ‘ప్రస్తుతం లంక లోని ఆదివాసీలు జన్యుపరంగా సింహళీయులను, శ్రీలంక తమిళులను పోలిఉన్నారు. దక్షిణ భారతం నుంచి వలస వెళ్లిన సింహళీయులు, శ్రీలంక త మిళులు, ఇతర సమూహాలు ఇక్కడున్న ఆదివాసీలతో సంబంధాలు ఏర్పరుచుకొని ఉంటాయని అధ్యయనంలో పాల్గొన్న చికాగో వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మానసా రాఘవన్ వెల్లడించారు.