EPS: మాజీసీఎం ధ్వజం.. అన్నదాతలను పట్టించుకోని డీఎంకే ప్రభుత్వం
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:26 AM
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, వారికి ఎలాంటి సహాయాలు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు. తిరువారూరులో సోమవారం ఉదయం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన రైతులతో ఈపీఎస్ భేటీ అయ్యారు.

- తిరువారూరులో ఈపీఎస్ ధ్వజం
చెన్నై: గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, వారికి ఎలాంటి సహాయాలు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు. తిరువారూరులో సోమవారం ఉదయం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన రైతులతో ఈపీఎస్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఈపీఎస్ మాట్లాడుతూ.. డెల్టా జిల్లాలను సీఎం స్టాలిన్(CM Stalin) విస్మరించారని, క్వింటాల్ ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రకటించలేదని ఆరోపించారు.
తన నాయకత్వంలో అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు డెల్టా జిల్లాలను సురక్షిత వ్యవసాయ క్షేత్రాలుగా ప్రకటించి, ఆ జిల్లాల్లోని రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేశానని చెప్పారు. డీఎంకే ప్రభుత్వమే డెల్టా జిల్లాల్లో మీథేన్ తవ్వకాలకు అనుమతించిందని, తన నాయకత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఆ తవ్వకాలు జరుగకుండా అడ్డుకుని రైతులను కాపాడిందని చెప్పారు.
రాష్ట్రంలో మళ్ళీ అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చాకే రైతుల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. 39 ఎంపీలు కలిగిన డీఎంకే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి రైతు సంక్షేమం కోసం ఎలాంటి పథకాలను తెప్పించలేదని ఈపీఎస్ విమర్శించారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వ పతనం తప్పదని, తన ప్రచార పర్యటన సభలకు వస్తున్న లక్షలాదిమంది జనమే ఈ విషయాన్ని చాటిచెబుతోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..
Read Latest Telangana News and National News