DMDK Premalatha: ఉత్తరాది వారికి ఇక్కడ ఓటు హక్కేంటి...
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:06 PM
ఉత్తరాది వారికి తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు కల్పించడమేంటని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రశ్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాది వాసులకు ఓటు హక్కు కల్పిస్తే, రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు
- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత
చెన్నై: ఉత్తరాది వాసులకు రాష్ట్రంలో ఓటు హక్కు కల్పించరాదని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత డిమాండ్ చేశారు. ‘ఉల్లం తేడి ఇల్లం నోడి’ అనే పేరుతో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టారు. ఆ ప్రకారం, మంగళవారం రాత్రి నీలగిరి జిల్లా కున్నూర్కు చేరుకున్న ఆమెకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి పడుగర్ వర్గానికి చెందిన వారి నివాస ప్రాంతాల్లో పర్యటించిన ప్రేమలత, పడుగర్ మహిళలతో కలసి సంప్రదాయ నృత్యం చేశారు.
ఈ సందర్భంగా ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉత్తరాది వాసులకు ఓటు హక్కు కల్పిస్తే, రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు. ఉత్తరాది రాష్ట్రాల వారు ఉపాధి కోసం రాష్ట్రానికి వచ్చేందుకు అభ్యంతరం లేదని, కానీ వారి ఓటు హక్కు వారి రాష్ట్రంలోనే ఉండాలన్నారు. కడలూరులో జనవరి 9న కనివినీ ఎరుగని రీతిలో డీఎండీకే రాష్ట్ర మహానాడు నిర్వహించనున్నామన్నారు.

‘ప్రజల హక్కులు కాపాడే మహానాడు 2.0’ పేరుతో నిర్వహించనున్న ఈ మహానాడులో, రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూటమి ఏర్పాటుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో డీఎండీకే బలంగా ఉందని ప్రేమలత తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News