Share News

Delhi rain havoc: ఢిల్లీ వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి, దెబ్బతిన్న విమానాలు, కూలిన చెట్లు, వీధులు జలమయం

ABN , Publish Date - May 22 , 2025 | 07:49 AM

ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా హస్తినలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. విమానాలకు అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్లు, వీధులు జలమయంతో పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది.

Delhi rain havoc: ఢిల్లీ వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి, దెబ్బతిన్న విమానాలు, కూలిన చెట్లు,  వీధులు జలమయం
Delhi rain havoc

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వడగళ్ల వర్షాల కారణంగా హస్తినలో ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చెట్లు కూలిపోయి, వీధులు జలమయమయ్యాయి. తీవ్రమైన వడగళ్ల వాన నగరంలో గందరగోళాన్ని సృష్టించింది. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ-ఘజియాబాద్, ఢిల్లీ-గురుగ్రామ్ వంటి కీలక రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చెట్లు నేలకూలాయి.


ఈ సమ్మర్‌లో 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో అనేక రోజులుగా మండుతున్న ఎండల తర్వాత, ముందుగా చెప్పినట్టుగానే ఢిల్లీలో నిన్న (బుధవారం) సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. భారీ వర్షం, వడగళ్ల వానలు, బలమైన గాలులు.. దేశ రాజధాని, ఇంకా దాని సమీప ప్రాంతాలను బలంగా తాకాయి. అయితే, ఇది ఢిల్లీ పరిసర వాసులకు మండే ఎండల నుంచి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ చెట్లు కూలిపోవడం, రోడ్లు జలదిగ్బంధం కావడం, ట్రాఫిక్ జామ్‌లకు కారణమయ్యాయి. దాదారి భాంగల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న సైన్ బోర్డులు, టవర్లు పడిపోయాయి.


ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలు దెబ్బతిన్నాయి. కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ఎల్లో లైన్ ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకుపోయారు. అక్షర్ధామ్ ఫ్లైఓవర్ సమీపంలో, సికంద్రా రోడ్, ITOకి దగ్గరున్న తిలక్ వంతెన కింద సహా నగరంలోని అనేక ప్రదేశాలలో నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు, నివాసితులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఢిల్లీ నుండి దక్షిణ-ఆగ్నేయం వైపంతా మేఘావృతమై ఉండటం వల్ల భారీ వర్షాలు పడ్డాయని, దీని వలన దుమ్ము తుఫాను, బలమైన గాలులు వీచాయని తెలిపింది.


నిన్న ఢిల్లీలో కురిసిన ఆకస్మిక వర్షానికి 22 ఏళ్ల వ్యక్తితోపాటు, మొత్తంగా ఏడుగురు చనిపోగా, వీరిలో ఒక వికలాంగుడు కూడా ఉన్నారు. 50 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. వెళ్తున్న వాహనాలపై చెట్లు పడటం, భారీగా వీస్తున్న గాలులు, వడగళ్ల వర్షాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.


ఇక, ఢిల్లీ విమానాశ్రయంలో 13 విమానాలను దారి మళ్లించారు. 12 విమానాలను జైపూర్‌కు దారి మళ్లించగా, ఒక అంతర్జాతీయ విమానాన్ని ముంబైకి మళ్లించామని, దీనివల్ల విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని విమానాశ్రయ వర్గాలు చెప్పాయి.

Updated Date - May 22 , 2025 | 07:56 AM