Covid Cases: 5,000 దాటిన కొవిడ్ కేసులు.. ఆరోగ్య శాఖ ఏమి చెప్పిందంటే
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:47 PM
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, అత్యధికంగా కేరళలో 1,679 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో గుజరాత్ (615), పశ్చిమబెంగాల్ (596), ఢిల్లీ (592) ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించగా.. కర్ణాటక, పంజాబ్లలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ (Covid-19) కేసుల సంఖ్య 5,000 దాటిందని, కేరళపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు తెలిపింది. ఒకే రోజులో సుమారు 500 కేసులు పెరగడంతో మొత్తం కేసుల సంఖ్య 5,364కు చేరినట్టు వెల్లడించింది. గత 24 గంటల్లో నలుగురు మృతిచెందినట్టు పేర్కొంది.
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, అత్యధికంగా కేరళలో 1,679 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో గుజరాత్ (615), పశ్చిమబెంగాల్ (596), ఢిల్లీ (592) ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించగా.. కర్ణాటక, పంజాబ్లలో ఒకరి చొప్పున మృతిచెందారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలూ ఆక్సిజన్, ఐసొలేషన్ పడకలు, వెంటిలేటర్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. చాలా కేసుల్లో తీవ్రత చాలా తక్కువగానే ఉందని, ఇళ్లలో జాగ్రత్తలు తీసుకుని తగ్గించుకోవచ్చని తెలిపింది. అయితే కేసులు పెరిగితే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది.
కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఫెసిలిటీ-లెవల్ ప్రిపేర్డ్నెస్ కోసం కేంద్రం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి 4,727 కేసులు రిపోర్ట్ కాగా, 55 మరణాలు సంభవించినట్టు అధికారులు ధ్రువీకరించారు. మే 22 నుంచి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 257గా ఉంది. కొవిడ్ పరిస్థితి, సన్నద్ధత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో జూన్ 2, 3 తేదీల్లో డీజీహెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ సునీత శర్మ అధ్యక్షత సాంకేతిక సమీక్షా సమావేశం జరిగింది. డిజాస్టర్ మేనేజిమెంట్ సెల్, ఈఎంఆర్ సెల్, ఎన్సీడీసీ, ఐసీఎంఆర్, ఐడీఎస్పీ, ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
చీనాబ్ రైల్వే వంతెనను నిర్మించిందెవరో తెలుసా..
For More National News and Telugu News..