Share News

Corona Cases India: దేశంలో వెయ్యికి చేరిన కరోనా కేసులు..ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం..

ABN , Publish Date - May 26 , 2025 | 01:15 PM

దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో ఈ కేసులు (Corona Cases India) నమోదు కాగా, ఇండియాలో కూడా తాజా సమచారం ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. అయితే ఏ ప్రాంతాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Corona Cases India: దేశంలో వెయ్యికి చేరిన కరోనా కేసులు..ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం..
COVID 19 Cases India

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ వెలుగులోకి వస్తున్న కోవిడ్ కేసులు ఇప్పుడు ఇండియాలో (Corona Cases India) కూడా మొదలయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు, తాజా సమాచారం (మే 26, 2025) ప్రకారం దేశంలో వెయ్యికిపై కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ నుంచి కర్ణాటక వరకు, మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు భయపెడుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 1009 యాక్టివ్ COVID19 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరంలో దేశంలో కరోనా కేసులు 1000 దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం.


ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు

కోవిడ్ -19 తాజా కేసుల విషయానికి వస్తే, కేరళలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో 15, రాజస్థాన్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 12, ​​పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, గోవాలో 1, తెలంగాణలో 1 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరుకుంది. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎటువంటి కరోనా యాక్టివ్ కేసులు నమోదు కాలేదు.


ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇటీవల పలు శాఖలు వీటి గురించి చర్చించాయి. వాటిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నిపుణులు ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ప్రధానంగా కరోనా వ్యాప్తి గురించి వీరు చర్చించారు. రాష్ట్రాలవారీ డేటా గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం కేరళ అత్యంత కరోనా ప్రభావిత రాష్ట్రంగా ఉంది. కేరళలో 430 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖ పర్యవేక్షణ, చికిత్స ప్రక్రియ కొనసాగుతోంది.


కరోనాను ఎలా నివారించాలి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. మారుతున్న వాతావరణం, పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని, లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దేశంలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని తెలిపింది. అయినప్పటికీ ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. రాబోయే రోజుల్లో టీకాలు వేయడం, పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.


ఇవీ చదవండి:

వైమానిక దాడి.. 40 మంది మృతి


నేడు పంజాబ్ vs ముంబై మధ్య కీలక మ్యాచ్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 03:08 PM