Caste Census: కర్ణాటకలో మళ్లీ కులగణన.. అధిష్ఠానం ఆదేశం
ABN , Publish Date - Jun 10 , 2025 | 05:36 PM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అధిష్ఠానం సూచనలు మేరకు కర్ణాటకలో కులగణన తిరిగి చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా డీకే శివకుమార్ ప్రకటించారు.

బెంగళూరు: కర్ణాటక (Karnataka) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కులగణన(Caste Census) చేపట్టనున్నట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivkumar) ఇవాళ (మంగళవారం) ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం తమను ఆదేశించినట్టు తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అధిష్ఠానం సూచనలు మేరకు కర్ణాటకలో కులగణన తిరిగి చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా డీకే శివకుమార్ ప్రకటించారు. కులగణనకు సంబంధించి ప్రతి ఒక్కరి అభిప్రాయాలను క్రోడీకరించాలని అధిష్ఠానం.. సీఎంకు, తనకు చెప్పినట్టు ఆయన తెలిపారు. ఇంతకుముందు కులగణనలో తమను పరిగణనలోకి తీసుకోలేదని ఎవరైతే భావిస్తున్నారో వారికి మరో అవకాశం ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం దీనిపై చర్చించి, ఒక ప్లాన్తో ముందుకు వస్తుందని, అందరికీ న్యాయం చేస్తుందని ఆయన చెప్పారు.
కర్ణాటక ప్రభుత్వం గత ఏప్రిల్లో కులగణన సర్వే రిపోర్టును సమర్పించగా.. ఇందులో తప్పుడు లెక్కలు ఉన్నాయంటూ లింగాయత్, వొక్కలింగ కమ్యూనిటీలు ఆరోపించాయి. ఆసక్తికరంగా కేంద్రప్రభుత్వం సైతం జనగణనతోపాటు కులగణన నిర్వహిస్తామని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం మరోసారి కులగణన చేపట్టనున్నట్టు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య హయాంలోనే 2015లో కులగణన జరిగింది. అయితే అప్పుడు సైతం కొన్ని కమ్యూనిటీలను ఇందులో చేర్చలేదని, తప్పులతడకగా సర్వే ఉందనే వివాదం తలెత్తింది.
ఇవి కూడా చదవండి..
తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం.. కర్ణాటక సర్కార్కు 9 ప్రశ్నలు
నాకు డ్రగ్స్ ఇచ్చారు.. పోలీసుల విచారణలో సోనమ్..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి