Share News

Congress: బిహార్ అంతర్గత విభేదాలపై కాంగ్రెస్ కొరడా.. ఏడుగురు నేతలపై వేటు

ABN , Publish Date - Nov 24 , 2025 | 09:17 PM

పార్టీ మౌలిక సిద్ధాంతాలు, ప్రవర్తనా నియమావాళికి భిన్నంగా ఈ నేతలు పార్టీ వెలుపల వేదికలపై తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీపీసీసీ పేర్కొంది.

Congress: బిహార్ అంతర్గత విభేదాలపై కాంగ్రెస్ కొరడా.. ఏడుగురు నేతలపై వేటు
Bihar poll debacle

పాట్నా: బిహార్‌లో పార్టీ అంతర్గతం విభేదాలపై కాంగ్రెస్ కొరడా ఝలిపించింది. ఏడుగురు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (BPCC) సోమవారంనాడు బహిష్కరించింది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది. బీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కపిల్‌దేవ్ ప్రసాద్ యాదవ్ ఈ ఆదేశాలను జారీ చేశారు.


పార్టీ మౌలిక సిద్ధాంతాలు, ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఈ నేతలు పార్టీ వెలుపల వేదికలపై తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీపీసీసీ పేర్కొంది. పార్టీ నిర్ణయాలను పదేపదే పత్రికల్లోనూ, సామాజికమాధ్యమాల్లోనూ విమర్శించడం, టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రచారం చేయడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందని తెలిపింది. పార్టీ పరిశీలకులు, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, ఏఐసీసీ సమీక్ష జరిపి, కేంద్ర పరిశీలకులు అవినాష్ పాండే సమ్మతితో పూర్తి పారదర్శకతంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరించింది.


బహిష్కరణ వేటు పడిన నేతలు వీరే

కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడిన నేతల్లో కాంగ్రెస్ సేవా దళ్ మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య పాశ్వాన్, బీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు షకీలుర్ రెహ్మాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్ శర్మ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ రాజన్, ఇతర వెనుకబడిన తరగతుల విభాగం మాజీ అధ్యక్షుడు కుందన్ గుప్తా, బంకా జిల్లా కాంగ్రెస్ కమిటీఅధ్యక్షురాలు కాంచన కుమారి, నలందా జిల్లాకు చెందిన రవి గోల్డెన్ ఉన్నారు. కాగా, తాజా బహిష్కరణలపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఘోర వైఫల్యం నుంచి సీనియర్ నేతలను కాపాడేందుకే అసమ్మతి పేరుతో కొందరిని బలిపశువులను చేశారని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి..

బీజేపీ మిషన్ బెంగాల్ ప్లాన్.. టార్గెట్ 160 ప్లస్

అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 24 , 2025 | 09:19 PM