CM Stalin: ఎంపీలకు స్టాలిన్ దిశానిర్దేశం.. కేంద్రం వివక్షపై గళమెత్తండి
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:46 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యేళ్లతరబడి భాష, విద్య, నిధుల విషయంలో అనుసరిస్తున్న నిర్ల్యక్ష వైఖరిని ఖండిస్తూ ఉభయ సభల్లో గళమెత్తాలని డీఎంకే ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో తేనాంపేటలోని అన్నా అరివాలయంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీల సమావేశం జరిగింది.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యేళ్లతరబడి భాష, విద్య, నిధుల విషయంలో అనుసరిస్తున్న నిర్ల్యక్ష వైఖరిని ఖండిస్తూ ఉభయ సభల్లో గళమెత్తాలని డీఎంకే ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో తేనాంపేటలోని అన్నా అరివాలయంలో శుక్రవారం ఉదయం లోక్సభ, రాజ్యసభ ఎంపీల సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఎంపీలు ఎలా ప్రవర్తించాలనే విషయమై సీఎం దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. గత 11 యేళ్లుగా రాష్ట్రాన్ని మోసగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కూడా పార్లమెంట్లో ప్రస్తావించాలన్నారు. విద్య, వైద్య, ఆర్థిక సంబంధిత కీలకమైన అంశాలపై ఉభయ సభల్లోనూ ఎంపీలు చర్చ లేవదీయాలన్నారు. మే 24న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తాను ప్రస్తావించిన కావేరి, వైగై, తామ్రభరణి నదులను శుభ్రపరిచే పథకం గురించి, కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే, అమలు చేసే పథకాలకు ఆంగ్లంలోనే పేర్లుపెట్టాలని తాను చేసిన ప్రతిపాదన గురించి కూడా డీఎంకే సభ్యులు మాట్లాడాలన్నారు.
మహారాష్ట్రలో త్రిభాషా విద్యావిధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించి అభాసుపాలైన కేంద్రప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉందన్న కారణంగా ఆ రాష్ట్రానికి ఎస్ఎ్సఏ నిధులను పూర్తిగా విడుదల చేసి, రాష్ట్రానికి మాత్రం మొండి చేయిని చూపిందని స్టాలిన్ విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తు న్న సవతితల్లి ప్రేమ ను గురించి కూడా ఉభయ సభల్లో పాలకపక్షాన్ని నిలదీయాలన్నారు.
ఆదాయానికి గండి...
పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం ఆదాయాన్ని రాష్ట్రానికి సక్రమంగా విడుదల చేయకపోవడాన్ని కూడా పాలకపక్షం దృష్టికి తీసుకెళ్ళాలని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రానికి చెల్లించాల్సిన ఉమ్మడి ఆదాయ వాటాను సక్రమంగా కేటాయించకుండా కేంద్రం గండి కొడుతోందన్నారు. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదన మేరకు 41 శాతం నిధులు విడుదల చేయడానికి బదులుగా 33.16శాతం నిధులు మాత్రమే కేటాయించిన విషయాన్ని కూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్ళాలన్నారు.
కీళడి పురావస్తు తవ్వకాల ద్వారా తమిళుల ప్రాచీన నాగరికత మూడువేల సంవత్సరాలనాటిదని నిర్ధారణ అవుతున్నా కేంద్ర ప్రభుత్వం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో మార్పులు చేయాలని నివేదికను తిప్పిపంపటం గర్హనీయమన్నారు. ఈ సమావేశంలోడీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, కోశాధికారి టీఆర్ బాలు, డిప్యూటీ కార్యదర్శులు, ఎంపీలు కనిమొళి, తిరుచ్చి శివ, ఎ.రాజా,, అందియూరు సెల్వరాజ్, ఆర్ఎస్ భారతి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News