CJI Sanjeev Khanna: రిటైర్మెంట్ తర్వాత ఏ పదవీ తీస్కోను
ABN , Publish Date - May 14 , 2025 | 04:35 AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీ విరమణ అనంతరం ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని స్పష్టం చేశారు. ఆయన న్యాయరంగానికి సేవలను కొనసాగిస్తానని చెప్పారు, తదుపరి సీజేఐ జస్టిస్ గవాయ్ మద్దతుతో తన సర్వసాధారణ సేవలను కొనసాగిస్తానని వెల్లడించారు.

న్యాయరంగానికి సేవలు కొనసాగిస్తా.. పదవీకాలం చివరిరోజున సీజేఐ సంజీవ్ఖన్నా స్పష్టీకరణ
తదుపరి సీజేఐ గవాయ్ తనకు బలమైన మద్దతుదారుగా నిలిచారని వెల్లడి
న్యూఢిల్లీ, మే 13: పదవీ విరమణ అనంతరం ఏ అధికారిక పదవినీ చేపట్టబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ఖన్నా స్పష్టం చేశారు. సీజేఐగా తన పదవీకాలం చివరిరోజైన మంగళవారం విధుల అనంతరం సుప్రీంకోర్టు ఆవరణలో జస్టిస్ ఖన్నా విలేకర్లతో మాట్లాడారు. రిటైర్మెంట్ అనంతరం అధికారిక పదవులను వేటినీ తీసుకోనప్పటికీ, న్యాయరంగానికి సంబంధించి సేవలను మాత్రం తప్పకుండా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు జస్టిస్ గవాయ్, జస్టిస్ సంజయ్కుమార్లతో కలిసి ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా విధులు నిర్వర్తించారు. అనంతరం, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తనకు నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఖన్నా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు విలువలను, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను, మౌలిక రాజ్యాంగ నిబంధనలను కొత్త ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ గవాయ్ కచ్చితంగా నిలబెడతారని తాను నమ్ముతున్నానన్నారు. ‘జస్టిస్ గవాయ్, నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒకే ఏడాది పదోన్నతి పొందాం. ప్రస్తుతం కొలీజియంలో ఉన్నాం. పలు సందర్భాల్లో మేం పరస్పరం చర్చించుకున్నాం. జస్టిస్ గవాయ్ నాకు అత్యంత బలమైన మద్దతుదారుగా నిలిచారు’ అని వెల్లడించారు. న్యాయమూర్తిగా తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని, వాటిని జీవితాంతం గుర్తుంచుకుంటానన్నారు. న్యాయవ్యవస్థ అంటే న్యాయమూర్తులు మాత్రమే కాదని, బార్ (న్యాయవాదులు) కూడా దాంట్లో భాగమని, ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేలా చేయటంలో న్యాయవాదుల పాత్రకూడా కీలకమని తెలిపారు. విభిన్న ప్రాంతాలకు చెందిన న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉండటంపై జస్టిస్ ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. ‘దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన జడ్జిలు ఉండటం వల్ల సుప్రీంకోర్టుకు ఎనలేని బలం చేకూరింది.
వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు ఆలోచనా ధోరణులు గల న్యాయమూర్తుల మధ్య జరిగిన చర్చలు పలు రకాల పరిష్కారాలను, సరైన మార్గాన్ని చూపాయి’ అని ఆయన వెల్లడించారు. జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, ‘1976 నాటి ఏడీఎం జబల్పూర్ కేసులో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఒక్కరే మైనారిటీ తీర్పునిచ్చారు. నాటి ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ హక్కుల కోసం నిలబడ్డారు. ఆయన సోదరుడి కుమారుడైన జస్టిస్ సంజీవ్ఖన్నా.. తన పెద్దనాన్న వారసత్వాన్ని నిలబెట్టటమే కాదు, న్యాయవ్యవస్థ మీద తనదైన సొంత ముద్ర వేశారు’ అని శ్లాఘించారు. జస్టిస్ ఖన్నాలో ఉండే స్పష్టత, నైతికనిష్ఠ, ఆయన ఇచ్చిన తీర్పులు రాజ్యాంగ విలువలకు అద్దం పడుతాయన్నారు. సుప్రీంకోర్టు ప్రతిష్ఠను జస్టిస్ ఖన్నా మరింత పెంచారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. ‘న్యాయం పట్ల మీకున్న అంకితభావం, మీరు చూపిన పారదర్శకత, యువ న్యాయవాదులకు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనివి. కొత్తతరాలకు మీరొక ప్రమాణాన్ని నిర్దేశించారు. నాడు జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఇచ్చిన మైనారిటీ తీర్పే నేడు అంతటా ప్రతిధ్వనిస్తోంది. మెజారిటీ తీర్పును అందరూ మర్చిపోయారు. జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సృష్టించిన ఆ జ్వాలను మీరు ముందుకు తీసుకెళ్లారు’ అంటూ జస్టిస్ సంజీవ్ఖన్నా సేవలను కపిల్ సిబల్ కొనియాడారు.