Share News

Bihar Assmbly Polls: అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్.. పోటీ ఎక్కడినుంచంటే

ABN , Publish Date - Jun 01 , 2025 | 02:53 PM

చిరాగ్ పాశ్వాన్ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి కాకుండా జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర బిహార్ ఇన్‌ఛార్జ్, జాముయి ఎంపీ అరుణ్ భారతి ఆదివారం నాడు ఒక ట్వీట్‌లో కోరారు.

Bihar Assmbly Polls: అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్.. పోటీ ఎక్కడినుంచంటే

పాట్నా: నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్‌ జనశక్తి పార్టీ (LJP) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) త్వరలో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) పోటీ చేసే అవకాశాలున్నాయి. మూడుసార్లు లోక్‌సభకు ఎంపీగా గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పోటీ చేయనుండటం ఇదే ప్రథమం. రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి కాకుండా జనరల్ (unreserved) నియోజకవర్గ నుంచి చిరాగ్ పాశ్వాన్ పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్, జాముయి ఎంపీ అరుణ్ భారతి ఆదివారం నాడు ఒక ట్వీట్‌లో కోరారు. దీంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.


రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఆలోచనను గత వారమే చిరాగ్ బయటపెట్టారు. హాజీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. దీనికి బలం చేకూరుస్తూ అరుణ్ భారతి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆదివారం నాడు ఒక పోస్ట్ చేశారు. 'బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్' అనేది చిరాగ్ ముఖ్యోద్దేశమని, అది నిజం చేయాలంటే బిహార్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ముందుండి చురుకుగా పాల్గొనాలని అన్నారు. ఒక కమ్యూనిటీకి మాత్రమే పరిమితం కాకుండా సమాజంలోని అన్నివర్గాలకూ ప్రాతినిధ్యం వహించే విధంగా జనరల్ కేటగిరి నుంచి చిరాగ్ పోటీచేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దపాత్ర పోషించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని, చిరాగ్ ఇవాళ బిహార్‌కు ఒక ప్రతినిధి మాత్రమే కాదని, రాష్ట్ర ఆశాకిరణమని అన్నారు.


పోటీ ఎక్కడి నుంచి?

మీడియా కథనాల ప్రకారం పట్నా, ధనపూర్, హాజీపూర్‌లలో ఏదో ఒకచోట నుంచి చిరాగ్ పోటీ చేసే అవకాశాలున్నాయి. దీనిపై ఆయన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చిరాగ్ ఇంతవరకూ లోక్‌సభ ఎన్నికల్లో జాముయి, హాజీపూర్ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల నుంచే పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతవరకూ పోటీ చేయలేదు.


2020 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరు

చిరాగ్ పాశ్వాన్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి వైదొలిగారు. నితీష్ కుమార్‌తో విభేదాల కారణంగా ఆయన సొంతంగా అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో అధికార పార్టీ బలహీనపడి బీజేపీ బలపడింది. పాశ్వాన్ పార్టీ ఒక సీటు మాత్రమే గెలిచినప్పటికీ తిరిగి లోక్‌సభ ఎన్నికల నాటికి పుంజుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 5 స్థానాల్లో పోటీచేసి గెలుపొందింది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఎన్డీయేలో సీట్ల షేరింగ్ చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు.


ఇవి కూాడా చదవండి..

పాకిస్థాన్ గూఢచర్యం కేసులో 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

మావోయిస్టుల కుట్రను భగ్రం చేసిన భద్రతా బలగాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 07:05 PM