Central Government: నాసిరకం హెల్మెట్లపై కేంద్రం సీరియస్
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:13 AM
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను వినియోగించడం గణనీయంగా పెరిగినా.. నాణ్యమైన హెల్మెట్ల వినియోగం తక్కువే ఉంటోంది.

అలాంటి హెల్మెట్ల తయారీ సంస్థలు, అమ్మకందారులపై కఠిన చర్యలు
అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం
బీఐఎస్ ధ్రువీకరణ హెల్మెట్లనే వాడాలని వాహనదారులకు సూచన
న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను వినియోగించడం గణనీయంగా పెరిగినా.. నాణ్యమైన హెల్మెట్ల వినియోగం తక్కువే ఉంటోంది. ఈ నేపథ్యంలో వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాసిరకం హెల్మెట్ల తయారీ, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులు ఐఎస్ఐ మార్కు, బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని, ఇందుకు తనిఖీలు నిర్వహించడంతోపాటు వినియోగదారులకు అవగాహన కల్పించాలని దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మేజిస్ట్రేట్లకు లేఖలు రాసినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో 21 కోట్లకుపైగా ద్విచక్ర వాహనాలున్నాయని, వాహనదారుల భద్రత అత్యంత ముఖ్యమని కేంద్రం తెలిపింది.