Central Schemes for Farmers: పీఎం కిసాన్ నుండి ఫసల్ బీమా వరకు.. ఈ సూపర్ స్కీమ్ల గురించి మీకు తెలుసా?
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:03 PM
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, పీఎం కిసాన్ నుండి ఫసల్ బీమా వరకు.. కేంద్రం తెచ్చిన కొన్ని సూపర్ స్కీమ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: రైతుల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా రైతులు నష్టాల నుంచి బయటపడటమే కాకుండా, భవిష్యత్తుకు మంచి పెట్టుబడి సహాయం పొందే అవకాశం కూడా కలుగుతోంది. ఈ పథకాలు రైతుల జీవన స్థితి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా పంట నష్టాలు, పెట్టుబడి లాభాలు, రుణ సౌకర్యం, మార్కెట్ యాక్సెస్ వంటి అంశాల్లో రైతులకు నేరుగా మేలు కలుగుతోంది. కాబట్టి, పీఎం కిసాన్ నుండి ఫసల్ బీమా వరకు.. కేంద్రం తెచ్చిన కొన్ని సూపర్ స్కీమ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN):
PM-KISAN అనేది భారతదేశం అంతటా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వ పథకం. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 6000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది. రూ.2000 చొప్పున మొత్తం మూడు విడతలుగా ఇస్తుంది. PM-KISAN రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి, వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడానికి సకాలంలో ఆర్థిక సహాయాన్ని నిర్ధారిస్తుంది.
పీఎం ఫసల్ బీమా యోజన (PMFBY):
పంట నష్టాలు, వర్షాభావం, తెగుళ్ల వల్ల రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైతులు ప్రీమియంగా ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తే, పంట నష్టానికి బీమా రీతిలో పరిహారం లభిస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డు (KCC):
రైతులకు తక్కువ వడ్డీతో రుణాలను సులభంగా పొందేలా రూపొందించిన ఈ పథకం 1998 నుంచి అమలులో ఉంది. ఇది వడ్డీ సబ్సిడీతో కూడిన పథకం. వడ్డీ రేటు 4% వరకు తగ్గుతుంది. విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్, ఇతర వ్యవసాయ అవసరాల కోసం తక్షణ పెట్టుబడి అందుతుంది.
పీఎం కుసుం స్కీమ్ (PM-KUSUM):
రైతులకు సౌరశక్తితో పనిచేసే పంపింగ్ సిస్టమ్లను అందించేందుకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే, పర్యావరణానికి మేలు చేస్తుంది.
నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (E-NAM):
జాతీయ వ్యవసాయ మార్కెట్ (eNAM) అనేది దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఒక ఆన్లైన్ ట్రేడింగ్ పోర్టల్. ఇది రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తెస్తుంది. రైతులు తమ పంటలను ఆన్లైన్ ద్వారా అమ్ముకునేలా కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ధరలను పొందే అవకాశం ఇస్తుంది.
సీడ్ విలేజ్ స్కీమ్:
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రూపొందించిన సీడ్ విలేజ్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లోనే విత్తన ఉత్పత్తి, నిల్వ, పంపిణీ చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ స్కీమ్:
రైతులు, రైతు సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు తమ స్వంతంగా గోదాములు, శీతల గదులు, అరణ్య ప్రాసెసింగ్ యూనిట్లు మొదలైన వ్యవసాయ మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు తక్కువ వడ్డీ రుణాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద అవకాశం కల్పిస్తుంది.
ఈ పథకాల ప్రయోజనాలు ఏమిటి?
రైతుల ఆర్థిక భద్రత పెరుగుతుంది
పెట్టుబడి భారం తగ్గుతుంది
పంట నష్టాలకు బీమా సౌకర్యం
మార్కెట్లో నేరుగా అమ్ముకునే అవకాశాలు
సాంకేతికత ఆధారిత వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం
ముఖ్య గమనిక:
ఈ పథకాల కోసం దరఖాస్తు చేయాలంటే:
ఆధార్ కార్డు, భూమి పత్రాలు, బ్యాంక్ వివరాలు తప్పనిసరి
మీ మండల వ్యవసాయ అధికారి లేదా గ్రామ కార్యదర్శి ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు లేదా CSC కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయొచ్చు.
Also Read:
పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్.. మహాదేవ్ పర్వతాల్లో మూసాను ఎలా మట్టుబెట్టారంటే..
వినే ధైర్యం లేకుంటే ఆ పదవికి అర్హులు కారు.. మోదీపై ఖర్గే విమర్శలు
For More National News