Sharmistha Panoli: శర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:36 PM
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కోల్కతా హైకోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000 పూచీకత్తు సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.

కోల్కతా: పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కోల్కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000 పూచీకత్తు(బెయిల్ బాండ్) సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. 'లా' విద్యార్థిని అయిన 22 ఏళ్ల శర్మిష్టని కోల్కతా పోలీసులు గత వారం గుర్గాంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమెను కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ వారం ప్రారంభంలో కోర్టు పనోలికి మధ్యంతర బెయిల్ నిరాకరించింది. 'చూడండి, మనకు వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ దాని అర్థం మీరు ఇతరులను బాధపెట్టడానికి కాదు. మన దేశం వైవిధ్యమైనది, వివిధ కులాలు, మతాలు, మతాలకు చెందిన వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేసేప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి'. అని జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ అన్నారు.
పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో శర్మిష్టపై దాఖలైన ఫిర్యాదులో ఎటువంటి నేర ప్రవృత్తి లేదని పనోలి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ఇండియా-పాకిస్థాన్ అంతటా సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగిందని.. వీరిలో ఎక్కువమంది పర్యాటకులని ఆయన కోర్టుకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు.
ఇలా ఉండగా, పనోలి అరెస్టు పశ్చిమ బెంగాల్ తోపాటు, యావత్ దేశంలో రాజకీయ వివాదానికి దారితీసింది. బెంగాల్లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శర్మిష్ట పనోలి అరెస్టును "సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్"గా అభివర్ణించింది. అంతేకాదు, కోల్కతా పోలీసులు తొందరపాటుతో వ్యవహరించారని ఆరోపించింది. అటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా శర్మిష్ట అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తాను శర్మిష్టకు అండగా ఉంటానని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
శర్మిష్ట అరెస్ట్పై పవన్ తీవ్ర ఆగ్రహం.. 'ఐ స్టాండ్ విత్ శర్మిష్ట' అంటూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్