Share News

Chenab Bridge Inauguration: బ్రిటిషర్ల కలను మీరు నిజం చేశారు.. ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసల జల్లు

ABN , Publish Date - Jun 06 , 2025 | 02:46 PM

చినాబ్ బ్రిడ్జి వంతెన ప్రారంభోత్సవానికి రాజకీయ ప్రాధాన్యత ఉందని ఒమర్ అబ్దుల్లా పేర్కొంటూ, ఇందుకు గత నాయకులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. త్వరలోనే జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Chenab Bridge Inauguration: బ్రిటిషర్ల కలను మీరు నిజం చేశారు.. ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసల జల్లు

శ్రీనగర్: శతాబ్దాల కలను నెరవేరుస్తూ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి చీనాబ్ రైల్ బ్రిడ్జి (Chenab rail bridge)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం నాడు ప్రారంభించారు. కట్‌డా నుంచి కాశ్మీర్‌కు వెళ్లే వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా వంతెన అందుబాటులోకి వచ్చింది. బ్రిటిషర్ల కాలం నాటి ప్రణాళిక ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చిందంటూ ప్రధాని మోదీపై కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ప్రశంసలు కురిపించారు. బ్రిటిషర్లు చేయలేని పని మోదీ చేశారని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒమర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్రైన్ సర్వీస్‌ కోసం ఎందరో కలలు కన్నారని, బ్రిటిషర్లు ఆ పని చేయలేకపోయినప్పటికీ ప్రధాని దానిని పూర్తి చేశారన్నారు. ఇప్పుడు కాశ్మీర్ లోయకు యావద్దేశంతో అనుసంధానం జరిగిందని అన్నారు.


ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింగ్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన చినాబ్ వంతెన మోడ్రన్ ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. 1,315 మీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలో ఎత్తైన ఐఫిల్ టవర్‌ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. 2002లో అటర్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. 23 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి మోదీ దీనిని సాకారం చేశారు.


నా ఎనిమిదేళ్ల వయస్సులో..

చీనాబ్ బ్రిడ్జి వంతెన ప్రారంభోత్సవానికి రాజకీయ ప్రాధాన్యత ఉందని ఒమర్ అబ్దుల్లా పేర్కొంటూ, ఇందుకు గత నాయకులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. త్వరలోనే జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును ఈ సందర్భంగా గుర్తుచేసుకోకుంటే తాను తప్పుచేసిన వాడినవుతానని సీఎం అన్నారు. తాను 8వ తరగతిలో ఉన్నప్పుడు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని ఒమర్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తన వయస్సు 55 ఏళ్లని, ఇప్పటికి ప్రాజెక్టు పూర్తయిందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులు జాతీయ ప్రాధాన్యత కలిగినవిగా వాజ్‌పేయి హోదా ఇవ్వడం, అలాగే బడ్జెట్‌ను పెంచడం వల్లే నేడు ఇది సాకారమైందని అన్నారు.


జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ స్టేషన్ నుంచి బనిహాల్ టన్నెల్, కాత్రా స్టేషన్, ఇప్పుడు చీనాబ్ బ్రిడ్జ్.. ఇలా ప్రతి కీలక ప్రాజెక్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాలుపంచుకునే అవకాశం కలగడం తన అదృష్టమని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ వంతెన లాగానే పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణమవుతున్నాయని చెప్పారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జి అంటే కేవలం స్టీలు, కాంక్రీట్‌తో నిర్మితమైనదే కాదని, తరతరాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని తెలిపారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. వికసిత్ జమ్మూకాశ్మీర్ లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని, జమ్మూకాశ్మీర్ ప్రజల తరఫున ప్రధానమంత్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి..

చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

చీనాబ్ రైల్వే వంతెనను నిర్మించిందెవరో తెలుసా..

For More National News and Telugu News..

Updated Date - Jun 06 , 2025 | 03:43 PM