Bihar Elections: బిహార్ ఎన్నికలను బహిష్కరించే యోచన
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:44 AM
బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని విపక్ష మహాఘట్బంధన్ యోచిస్తోంది.

బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ వెల్లడి
పట్నా, జూలై 23: బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని విపక్ష మహాఘట్బంధన్ యోచిస్తోంది. ఈ విషయాన్ని బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటామని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బుధవారం బిహార్ అసెంబ్లీ అట్టుడికింది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దుర్భాషలాడుకున్నారు. నల్ల టీ షర్ట్ ధరించి వచ్చిన తేజస్వీ యాదవ్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ సరిగ్గా ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుబట్టారు. ‘‘నకిలీ ఓటర్ల ఏరివేత అంటున్నారు. మరి ఈ నకిలీ ఓటర్లతోటే ప్రధానిగా మోదీ, సీఎంగా నితీశ్ గెలిచారా’’ అన్నారు.
తేజస్వీ పిల్లవాడు
అసెంబ్లీలో తేజస్వీ ప్రసంగిస్తుండగా సీఎం నితీశ్ అడ్డు తగిలారు. తేజస్వీని పిల్లాడిగా అభివర్ణించారు. ఇలాంటి విషయాలు తేజస్వీకి అర్థం కావన్నారు. అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజుల్లో ముగుస్తాయని, ఆ తర్వాత కావాలంటే ఎన్నికల సభల్లో ప్రసంగించుకోవాలని ఎద్దేవా చేశారు.