Tantric Ritual: కుక్క రక్తంతో యువతి క్షుద్రపూజలు
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:02 PM
మతిస్థిమితం లేకో, మరేదైనా పేరాశో.. బెంగళూరులో ఒక యువతి తన పెంపుడు కుక్కలలో ఒక కుక్క గొంతు కోసి దాని రక్తంతో క్షుద్రపూజలు చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆ యువతి నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన..

బెంగళూరు: మతిస్థిమితం లేకో.. లేదా మరేదైనా పేరాశో కాని బెంగళూరులో ఒక యువతి చేయకూడని పని చేసింది. తన పెంపుడు కుక్కలలో ఒక కుక్క గొంతుకోసి దాని రక్తంతో క్షుద్రపూజలు చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆ యువతి నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కన ఉన్న నివాసితులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ వారం ఆరంభంలో సదరు యువతి ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. చంపిన కుక్క రక్తంతో సదరు యువతి 'తాంత్రిక' పూజలు నిర్వహించినట్టు ఇంటిలోని పరిస్థితుల్ని చూస్తే అర్థమవుతుందని పోలీసులు అంటున్నారు. ఆ మహిళకు మూడు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటిలో ఒక దాన్ని చంపి క్షుద్రపూజలు జరిపినట్టు మున్సిపల్, పోలీస్ అధికారులు భావిస్తున్నారు. మిగతా రెండు కుక్కలు ఇంటిలోని గోడకి కట్టి ఉన్నాయి.
నిందితురాలిని త్రిపర్ణ పాయక్గా గుర్తించారు. ఆ మహిళ తన పెంపుడు లాబ్రడార్ కుక్కను గొంతు కోసి చంపి, ఆ తర్వాత కుక్క శరీరాన్ని ఒక గుడ్డలో చుట్టి ఉంచి, ఫ్లాట్ అన్ని కిటికీలు, తలుపులను మూసివేసి, అపార్ట్మెంట్కు తాళం వేసి పారిపోయింది. దీంతో అపార్ట్మెంట్ దగ్గర నుండి కుళ్ళిన వాసన వస్తున్నట్లు పొరుగువాళ్లు గమనించి, బెంగళూరు పౌర సంస్థ (బృహత్ బెంగళూరు మహానగర పాలికే)కి సమాచారం ఇచ్చారు.
సదరు మున్సిపల్ అధికారులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లినప్పుడు కుళ్ళిన కుక్క మృతదేహాన్ని చూశారు. సదరు ఫ్లాట్లో కొన్ని అనుమానాస్పద వస్తువులు కూడా కనిపించాయి. ఇంట్లో అనేక మతపరమైన చిత్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో ఇదేదో ఒక 'తాంత్రిక' పూజ నిర్వహించి ఉంటారని అధికారులు నిర్ధారణకు వచ్చారు.
గోడకి కట్టివేసిన మరో రెండు కుక్కలని BMP ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మహదేవ్ పుర పోలీస్ స్టేషన్లో జంతు హింస, సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు మహిళపై కేసు నమోదు చేశారు. ఈ భయంకరమైన పనికి క్షుద్రపూజ నేపథ్యమా లేక నిందితురాలి మానసిక స్థితా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితురాలు పశ్చిమ బెంగాల్కు చెందినామె అని, బెంగళూరులో నివసిస్తుందని చెబుతున్నారు.
ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారం జంతువుల హక్కులు, పెంపుడు జంతువుల భద్రత గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అనేకమంది జంతు ప్రేమికులు, సంస్థలు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బోనాల జాతర.. గోల్కొండ కోటకు భక్తుల తాకిడి..
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
For More AP News and Telugu News