Plan Crah: ఆటో డ్రైవర్ బిడ్డ, శతకోటి ఆశలతో లండన్కు పయనం. అంతలోనే..
ABN , Publish Date - Jun 14 , 2025 | 06:29 PM
తండ్రి ఆటో డ్రైవర్. ఆ పేదింట్లో ఆమె చదువుల సరస్వతి. అవిశ్రాంతంగా పోరాడి అనుకున్నది సాధించింది. దీక్షాదక్షతతో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ కోసం UKకి వెళుతోంది. ఒక్క నిమిషంలో..

ఇంటర్నెట్ డెస్క్: తండ్రి ఆటో డ్రైవర్. ఆ పేదింట్లో ఆమె చదువుల సరస్వతి. ఎన్నో కష్టాలకోర్చి అవిశ్రాంతంగా పోరాడి అనుకున్నది సాధించింది. ఒక పక్క కుటుంబ ఆర్థిక నేపథ్యం సహకరించకపోయినా దీక్షాదక్షతతో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ కోసం UKకి వెళుతోంది. ఫ్లైట్ ఎక్కిన నిమిషం దాటకుండానే ప్రాణాలు కోల్పోయింది. గుజరాత్కు చెందిన పాయల్ ఖాతిక్ అనే యువతి విషాదగాధ ఇది.
గుజరాత్లోని హిమత్నగర్కు చెందిన పాయల్ ఖాతిక్ అనే ఈ యువతి తొలిసారి విదేశాలకు ప్రయాణమైంది. లండన్ లో మాస్టర్స్ చేయాలన్న తన కల సాకారం కాబోతోందన్న ఆనందంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎయిర్ పోర్ట్ ముందు ఫొటో కూడా దిగింది. అయితే, అదే ఆమె ఆఖరి ఫ్యామిలీ చిత్రమైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో పాయల్ కూడా ఒకామె.
పాయల్ తండ్రి లోడింగ్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వాస్తవానికి, వాళ్ల కుటుంబంలో ఇంత స్థాయికి చేరింది పాయల్ ఒక్కతే. ఖాతిక్ కుటుంబం ఉదయం 10 గంటల కంటే ముందే తమ ప్రియమైన కుమార్తెకు వీడ్కోలు పలికి ఇంటికి వెళ్లింది. తమ బిడ్డ పాయల్ లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుంటుందని, అక్కడ చదువులో చక్కగా రాణించగలదని పూర్తి నమ్మకంగా వాళ్లంతా ఇంటికి వెళ్లారు. అయితే, ఇంటికి చేరే లోపే అత్యంత దారుణమైన వార్తను వారంతా వినాల్సివచ్చింది.
ఎయిర్ ఇండియా విమానం AI-171 అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. సిబ్బందితో కలిసి మొత్తం ఫ్లైట్లో ఉన్న 242 మందిలో ఒక్క ప్రయాణీకుడు మినహా మిగతా వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారంతా విమానం మెడికల్ హాస్టల్ భవనంలోకి దూసుకుపోవడంతో చనిపోయిన వాళ్లు.
కాగా, పాయల్ ఖాతిక్ చనిపోయిందని, DNA టెస్ట్ ద్వారా నిర్ధారించారు. ఈ విషయాన్ని పాయల్ తల్లిదండ్రులకు వెల్లడించారు. 'కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత, ఆమె మాతోనే ఉంది. లండన్లో మరింత చదవాలనుకుంది. అందుకే, ఆమె చదువుకు అనేక రుణాలు తీసుకున్నాం...' అని ఆమె తండ్రి సురేష్ ఖాతిక్ కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ వల్ల మా కుటుంబ పేదరికానికి విముక్తి వస్తుందని భావించామని, అయితే, ఇప్పుడు ఇలా జరగడం దారుణమని ఆ తండ్రి విలపిస్తున్నారు. చేసిన అప్పులన్నింటినీ ఎలా తీర్చాలంటూ వాపోయారు.
ఉదయపూర్ నుండి బిటెక్ పూర్తి చేసిన పాయల్.. గత ఆరేళ్లుగా ట్యూషన్స్ చెప్పుకుంటూ చదువుకుంటోంది. ఆమె హిమత్నగర్లోని ఆదర్శ్ స్కూల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుకుంది. హిమత్ హై స్కూల్లో 11, 12వ తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత మంచి మార్కులతో ఇంజనీరింగ్లో చేరి మంచి మార్కులతో డిగ్రీ పట్టా అందుకుంది. ఆపై ఉన్నత చదువుకోసం లండన్ వెళ్తుండగా ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్కు ఇజ్రాయెల్ క్షమాపణలు..
Read Latest National News And Telugu News