Share News

Ankita Bhandari Case: అంకిత భండారి కేసులో కీలక తీర్పు

ABN , Publish Date - May 30 , 2025 | 04:09 PM

ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలోని ఒక పేద కుటుంబానికి చెందిన అంకిత భండారి కొవిడ్ కారణంగా ఆర్థిక సమస్యలతో హోటల్ మేనేజిమెంట్ కోర్సును మధ్యలోనే నిలిపేసింది. ఆమె తండ్రి ఒక గార్డుగా పనిచేసేవారు. ఈ క్రమంలో పుష్ప అనే ఫ్రెండ్ ద్వారా రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో ఆమెకు రిసెప్షనిస్టుగా ఉద్యోగం దొరికింది.

Ankita Bhandari Case: అంకిత భండారి కేసులో కీలక తీర్పు

కోట్‌ద్వార్: సుమారు మూడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 19 ఏళ్ల రిసెప్షనిస్టు అంకిత భండారి (Ankita Bhandari) హత్య కేసులో ఉత్తరాఖండ్ స్థానిక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిసార్ట్ యజమాని పుల్‌కిత్ ఆర్య, అతనికి సహకరించిన ఇద్దరు ఉద్యోగులు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను దోషులుగా నిర్ధారించింది. వీరికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.


ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలోని ఒక పేద కుటుంబానికి చెందిన అంకిత భండారి కొవిడ్ కారణంగా ఆర్థిక సమస్యలతో హోటల్ మేనేజిమెంట్ కోర్సును మధ్యలోనే నిలిపేసింది. ఆమె తండ్రి ఒక గార్డుగా పనిచేసేవాడు. ఈ క్రమంలో పుష్ప అనే ఫ్రెండ్ ద్వారా రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో ఆమెకు రిసెప్షనిస్టుగా ఉద్యోగం వచ్చింది. 2022 సెప్టెంబర్ 18వ తేదీన ఆమె కనిపించకుండా పోవడం, నాలుగు రోజుల తర్వాత మృతదేహం ఒక కాలువలో దొరకడం సంచలమైంది. దీనిపై జనాగ్రహం వ్యక్తమైంది. పుల్‌కిత్ ఆర్క్ తండ్రి వినోద్ ఆర్య బీజేపీ మాజీ నేత కావడంతో కేసు నుంచి అతన్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వినోద్ ఆర్యను పార్టీ నుంచి బీజేపీ తొలగించింది. కేసు విచారణను సిట్‌కు అప్పగించారు. ఈ క్రమంలో పుల్‌కిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను అరెస్టు చేశారు. విచారణలో రిసార్ట్‌కు వచ్చే అతిథులకు అదనపు సేవలు అందించాలని అంకితపై పుల్‌కిత్ ఒత్తిడి తెచ్చాడని, ఆమె అంగీకరించకపోవడంతో జరిగిన పెనుగులాటలో అతను, అతని సహోద్యోగులు కలిసి ఆమెను కాలువలోకి తోసేశారని తేలింది. వేధింపులు, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ సహా పలు సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేశారు.


ఈ కేసు 2023 జనవరి 30న తొలిసారి విచారణకు రాగా, మొత్తం 97 మందిలో 47 మంది సాక్ష్యులను సిట్ విచారించింది. 500 పేజుల ఛార్జిషీటును కోర్టుకు సమర్పించింది. ఎట్టకేలకు రెండేళ్ల విచారణ అనంతరం శుక్రవారం నాడు పుల్‌కిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను అదనపు సెషన్స్ జడ్జి రీనా నెగి దోషులుగా ప్రకటించారు. ఈ ముగ్గురికీ జీవిత ఖైదు విధించారు. కాగా, నిందితులకు ఉరిశిక్ష విధించాలని అంకిత తల్లి సోని దేవి మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలంతా తమ కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

సంతకాలు చేస్తారు.. డెలివరీలు జరగవు.. వాయుసేన చీఫ్ సీరియస్!

పీవోకే తిరిగొస్తుంది: రాజ్‌నాథ్‌

For National News And Telugu News

Updated Date - May 30 , 2025 | 05:16 PM