Amit Shah: భారత సైన్యాన్ని మెచ్చుకున్న అమిత్ షా.. అసలు కారణమిదే..
ABN , Publish Date - May 23 , 2025 | 01:51 PM
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్థాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇలా పాకిస్థాన్ అనేక దాడులను భారత్ తిప్పికొట్టినట్లు గుర్తుచేశారు షా. బీఎస్ఎఫ్ 22వ పదవీ పురస్కార కార్యక్రమానికి ఢిల్లీలో హాజరైన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.

ఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన 22వ బీఎస్ఎఫ్ (BSF) పదవి పురస్కార కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ను ప్రశంసించారు. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, బీఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అద్భుతంగా పనిచేశాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతమైందన్నారు. గతంలో పాకిస్థాన్ ఆధ్వర్యంలో జరిగిన దాడులకు ఆయా ప్రభుత్వాలు తగిన సమాధానం ఇవ్వలేదని అమిత్ షా విమర్శించారు. కానీ 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిందన్నారు. ఉగ్రవాద దాడులకు గట్టి సమాధానం ఇవ్వడమే కాదు, భారత్ అంటే ప్రపంచానికి తెలిసేలా చేశామన్నారు అమిత్ షా.
ఉరీ, సర్జికల్ స్ట్రైక్
2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఉరీలో జరిగిన దాడి దేశాన్ని కలచివేసింది. ఈ దాడిలో భారత సైనికులను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. దీనికి సమాధానంగా భారత సైన్యం మొదటిసారిగా శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్ ప్రపంచవ్యాప్తంగా భారత సైన్యం శక్తిని చాటిచెప్పింది.
పుల్వామా ఎయిర్ స్ట్రైక్
ఉరీ దాడి తర్వాత, 2019లో పుల్వామాలో మరో దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సమాధానంగా భారత వైమానిక దళం ఎయిర్ స్ట్రైక్ నిర్వహించి, పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్.. సాయుధ బలగాల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది.
పహల్గామ్ దాడికి, ఆపరేషన్ సిందూర్
ఇటీవల పహల్గామ్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను వారి మతం ఆధారంగా గుర్తించి హతమార్చారు. ఈ దారుణ ఘటనకు సమాధానంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ప్రధానమంత్రి మోదీ రాజకీయ దృఢత్వం కలిసి పనిచేశాయి. చివరకు ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది. ఈ సందర్భంగా ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత సైన్యాన్ని ప్రశంసిస్తున్నాయని షా వెల్లడించారు.
బీఎస్ఎఫ్ పాత్ర
ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ను అమిత్ షా మెచ్చుకున్నారు. భారతదేశానికి అత్యంత సవాలుతో కూడిన సరిహద్దులైన బంగ్లాదేశ్, పాకిస్థాన్ రక్షణ బాధ్యతను బీఎస్ఎఫ్కు అప్పగించినట్లు ప్రస్తావించారు. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తోందని అమిత్ షా అన్నారు. మీ సామర్థ్యంతో ఈ సరిహద్దులను గొప్పగా కాపాడారని షా కొనియాడారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం మరోసారి తన శక్తిని నిరూపించిందన్నారు. పహల్గామ్ దాడి తర్వాత, ప్రధానమంత్రి మోదీ తగిన సమాధానం ఇస్తామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి పాకిస్థాన్కు గట్టి సమాధానం ఇచ్చిందన్నారు కేంద్రమంత్రి అమిత్ షా.
ఇవీ చదవండి:
నేడు ఆర్సీబీ vs హైదరాబాద్ మ్యాచ్..ఆర్సీబీ ఓడితే
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి