Mega Police Recruitment: 60,244 కొత్త పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు
ABN , Publish Date - Jun 15 , 2025 | 03:39 PM
ఇవాళ అత్యంత పేద తల్లిదండ్రుల కుమారుడు కూడా పోలీసు నియామకంలో భాగమయ్యాడు. మొత్తం రాష్ట్రానికి భద్రత కల్పించగల శక్తిగా మారాడు అని సీఎం చెప్పారు. రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక ప్రధాన అడుగు అని సీఎం అభివర్ణించారు.

ఇంటర్నెట్ డెస్క్: పోలీస్ యూనిఫాంకు ఒక నియమం ఉందని.. 'మీరు శిక్షణలో ఎంత ఎక్కువ చెమటోడిస్తే, జీవితంలో తక్కువ రక్తం చిందిస్తారు' అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన పోలీస్ కానిస్టేబుళ్లను ఉద్ధేశించి సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (ఆదివారం) కొత్తగా ఎంపికైన 60,244 మంది పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఇది రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ప్రధాన అడుగు అని సీఎం అభివర్ణించారు. ఈ వేడుక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పోలీసు దళానికి కఠినమైన శిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తమ బాధ్యతల్ని పూర్తి అంకితభావంతో నిర్వర్తించాలని, దేశంలోనే అతిపెద్ద పోలీసు దళంలో భాగం కాబోతున్న వేళ అభినందనలు తెలియచేస్తున్నానని సీఎం అన్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేపట్టి పూర్తి పారదర్శకతతో నియామక ప్రక్రియ చేపట్టింది. భారీ సంఖ్యలో.. ఏకంగా 60వేల 244 మంది కొత్త పోలీస్ కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకుని వాళ్లందరికీ నియామక పత్రాలను అందించింది. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సత్కరించారు. ఉద్యోగాలకు ఎంపికైన పోలీసుల్ని ఉద్దేశించి సీఎం యోగి ఆసక్తికర ప్రసంగం చేశారు.
2017 నుంచి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఎన్నో చర్యలు తీసుకున్నామని అవన్నీ ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయని సీఎం యోగి చెప్పారు. నియామకాల స్థాయి, సమగ్రతను హైలైట్ చేస్తూ ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగింది. ఇవాళ అత్యంత పేద తల్లిదండ్రుల కుమారుడు కూడా పోలీసు నియామకంలో భాగమయ్యాడు. మొత్తం రాష్ట్రానికి భద్రత కల్పించగల ఒక శక్తిగా మారాడు అని సీఎం యోగి చెప్పారు. ఇదే సందర్భంలో యూపీ పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ.. మహా కుంభ్కు వచ్చిన వారెవరైనా పోలీసుల ప్రవర్తనను ప్రశంసించారన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు వారిపై గతంలో ఉన్న అపవాదుని తుడిచివేయడానికి ఎంతో కృషి చేశారని కీర్తించారు.