Indian Airports: 32 విమానాశ్రయాల్లో సర్వీసులు మొదలు
ABN , Publish Date - May 13 , 2025 | 05:26 AM
భారత విమానాశ్రయాలు 32 ప్రాంతాలలో సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. పాకిస్థాన్తో కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ విమానాశ్రయాల్లో రాకపోకలు పునరుద్ధరించబడినట్లు ఏఏఐ ప్రకటించింది.

ఆపరేషన్ సిందూర్తో 7 నుంచి ఆగిన రాకపోకలు
న్యూఢిల్లీ, మే 12(ఆంధ్రజ్యోతి): పాక్తో కాల్పుల విరమణ నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్ ప్రాంతాల్లోని 32 విమానాశ్రయాల తాత్కాలిక మూసివేతను ఎత్తేస్తున్నట్లు భారత విమానాశ్రయాల సంస్థ (ఏఏఐ) సోమవారం ప్రకటించింది. ఈ విమానాశ్రయాల్లో పౌర విమనాల రాకపోకలు తక్షణం ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇండిగో, స్పైస్జెట్ సహా పలు ప్రధాన విమానయాన సంస్థలు కూడా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. ఏఏఐ ఆదేశాల నేపథ్యంలో విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టుల అధికారులు విమాన సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో బుధవారం నుంచి 24 విమానాశ్రయాల పరిధిలో విమానాల రాకపోకలపై ఏఏఐ ఆంక్షలు విధించింది. శనివారం దాన్ని 32 ఎయిర్పోర్టులకు విస్తరించింది. శ్రీనగర్, చండీగఢ్, అమృత్సర్, జై సల్మేర్, జోధ్పూర్, పఠాన్కోట్, లేహ్, రాజ్కోట్, పోర్ బందర్ తదితర 32 విమానాశ్రయాల పరిధిలో తాత్కాలికంగా విమాన సర్వీసులు రద్దు చేశారు.