Amit shah: 11 ఏళ్ల మోదీ పాలన స్వర్ణయుగం: అమిత్షా
ABN , Publish Date - Jun 09 , 2025 | 06:57 PM
ఈ పదకొండేళ్లలో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, సాంస్కృతిక గౌరవం, జాతీయ భద్రతతో కొత్త శకాన్ని దేశం చూస్తోందని కేంద్ర హోమంత్రి అమిత్షా అన్నారు. బలమైన నాయకత్వం, దృఢ సంకల్పం, ప్రజాసేవ చేయాలనే తపన ఉంటే సుపరిపాలన సాధ్యమేనని మోదీ ప్రభుత్వం నిరూపించిందని వివరించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో 11 ఏళ్ల పాలనను స్వర్ణయుగంతో కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah) పోల్చారు. చెక్కుచెదరని సంకల్పం, అవిశ్రాంత కృషి, ప్రజాసేవ పట్ల అంకిత భావంతో కూడిన స్వర్ణయుగంగా మోదీ పాలనను పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా అమిత్షా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ట్వీట్ చేశారు.
ఈ పదకొండేళ్లలో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, సాంస్కృతిక గౌరవం, జాతీయ భద్రతతో కొత్త శకాన్ని దేశం చూస్తోందని అమిత్షా అన్నారు. బలమైన నాయకత్వం, దృఢ సంకల్పం, ప్రజాసేవ చేయాలనే తపన ఉంటే సుపరిపాలన సాధ్యమేనని మోదీ ప్రభుత్వం నిరూపించిందని వివరించారు. 2014లో పరిస్థితిని ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టినప్పుడు దేశంలో విధానపరమైన అచేతన స్థితి, నాయకత్వ కొరత, తారాస్థాయిలో అవినీతి ఉండేదని చెప్పారు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని, దిశానిర్దేశం లేని పాలన కొనసాగేదని అన్నారు. 'గరిష్ట పాలన-కనిష్ఠ ప్రభుత్వం' అనే సిద్ధాంతంతో గత 11 ఏళ్లుగా అభివృద్ధి వేగాన్ని పునర్నిర్వచించామని చెప్పుకొచ్చారు.
రైతులు, మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి మోదీ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బుజ్జగింపు విధానాలకు బదులు సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్తో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. జాతీయ భద్రత పరంగా సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ నక్సలిజం చివరి దశలో ఉందని, జమ్మూకశ్మీర్, ఈశాన్య భారతంలో శాంతిని పునరుద్ధరించామని, ఇండియా ఇప్పుడు ఉగ్రవాదంపై అసాధారణ రీతిలో వ్యవహరిస్తోందని కొనియాడారు. ఉగ్రవాదంపై ఉక్కుపిడికిలి బిగించిందని, అవసరమైతే శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లయినా ఉగ్రవాదులను మట్టుబెడుతుందని చెప్పారు. మోదీ 3.0 హయాంలో అభివృద్ధి, స్వయం సమృద్ధి దిశగా దేశం శీఘ్రగతిని పురోగమిస్తోందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చేందుకు ప్రతి రంగంలోనూ మేక్ ఇండియాను నంబర్ వన్ చేసే దిశగా ప్రయాణం కొనసాగుతోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
వర్తమానం ఊసెత్తకుండా 2047 గురించి కలలా?
ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి