Dy CM: వారిని ప్రోత్సహించడమే మా లక్ష్యం..
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:43 AM
దివ్యాంగులను ప్రోత్సాహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి అన్నారు. ఆయన మాట్లాడుతూ..దివ్యాంగ క్రీడాకారులు వంద మందికి 3 శాతం రిజర్వేషన్ కింద ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించామని తెలిపారు.

- గత ఏడాది 104 మందికి ఉద్యోగాలు
- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి
చెన్నై: దివ్యాంగ క్రీడాకారులకు అండగా ఉంటామని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) ప్రకటించారు. మంగళవారం శాసనసభలో దివ్యాంగ క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఓ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉదయనిధి మట్లాడుతూ గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మార్గదర్శకాలతో దివ్యాంగ క్రీడాకారులు వంద మందికి 3 శాతం రిజర్వేషన్ కింద ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించామని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..
ఆ ప్రకారం, ప్రభుత్వ శాఖల్లో 104 మంది క్రీడాకారులకు గత ఏడాది ఉద్యోగ నియామకపత్రాలు ముఖ్యమంత్రి అందజేశారన్నారు. అలాగే, ఈ ఏడాది కూడా 3 శాతం రిజర్వేషన్లో మరో వంద మంది క్రీడాకారులను ఉద్యోగాల్లో నియమించనున్నామన్నారు. గత ఏడాది చేపట్టిన 104 ఉద్యోగ నియామకాల్లో 11 మంది క్రీడాకారులు పోలీస్ కానిస్టేబుళ్లుగా నియమించామన్నారు. అలాగే, పోలీసు శాఖలో 32 మంది ఎస్ఐల నియామకాలకు తమిళనాడు క్రీడాభివృద్ధి సమాఖ్య దరఖాస్తులు ఆహ్వానించిందన్నారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలిపారు.
పోలీసు శాఖలో దివ్యాంగ క్రీడాకారులకు తప్పక ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. దివ్యాంగుల అభ్యున్నతి, సంక్షేమానికి ముఖ్యమంత్రి మార్గదర్శకాలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గత వారం ముఖ్యమంత్రి ఈ సభలో దివ్యాగులను స్థానిక సంస్థల్లో నియమించనున్నట్లు ఒక బిల్లు ప్రవేశపెట్టారని, దేశంలోనే ఇలాంటి విధానం అమలుచేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచిందని, ఈ చొరవ ద్వారా సుమారు 13వేల మంది దివ్యాంగులు స్థానిక సంస్థల పదవుల్లో నియమితులు కానున్నారని తెలిపారు.
అన్ని రంగాలతో సమానంగా క్రీడా రంగంలోనూ దివ్యాంగులు రాణించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పోటీల్లో పాల్గొనే ముందు శిక్షణా ఫీజు, రవాణా ఖర్చులు తదితరాలను తమిళనాడు ఛాంపియన్స్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధికసాయం అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 198 పారా క్రీడాకారుల శిక్షణ, ప్రయాణ ఖర్చుల కోసమే ఛాంపియన్ ఫౌండేషన్ నుంచి రూ.4.5 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ఏడాది భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో కనీసం 25 శాతం దివ్యాంగ క్రీడాకారులుండేలా చర్యలు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు
Singareni: సింగరేణి ఉపకార వేతనం
Read Latest Telangana News and National News