Parenting Tips: తల్లిదండ్రులు చేసే తప్పులు పిల్లలను పిరికివాళ్లని చేస్తాయి..
ABN , Publish Date - May 30 , 2025 | 08:22 AM
Parents Mistakes: పిల్లల పెంపకం చాలా బాధ్యతాయుతమైన పని అని అంటారు. చాలా సార్లు తల్లిదండ్రులు అనుకోకుండానే కొన్ని తప్పులు చేస్తారు. దాని వల్ల పిల్లలు పిరికివాళ్ళుగా తయారవుతారు. ఇలాంటి పిల్లల్లో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. అన్నింటా వెనకబడిపోతారు.

Parenting Mistakes and Child Confidence: బాల్యం అనేది ఒక వ్యక్తి జీవితానికి పునాది వేస్తుంది. ఈ సమయంలోనే పిల్లల ఆలోచనలు, భావాలు, ఆత్మవిశ్వాసం రూపుదిద్దుకుంటాయి. చిన్నతనానికి సంబంధించిన చిన్నా పెద్దా అనుభవాలన్నీ పిల్లల వ్యక్తిత్వంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. మొత్తం మీద ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్మించేది బాల్యమే. ఇందులో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. వారి ప్రవర్తన, అలవాట్లు, ఆలోచనలే పిల్లలు పుణికి పుచ్చుకుంటారు. పేరెంట్స్ పెంపకాన్ని బట్టే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక కొంతమంది చాలా సిగ్గుపడుతుంటారు. పిరికివారుగా ఉంటారు. వారికి ఆత్మవిశ్వాసం కూడా ఉండదు. నిజానికి దీని వెనుక ఉన్న కారణం వారు చిన్నతనంలో ఎదుర్కొన్న ప్రత్యేక పరిస్థితులే. ఇలా జరగకూడదంటే పేరెంట్స్ పొరపాటున కూడా పిల్లలతో కింది విధంగా ప్రవర్తించకూడదు.
తిట్టడం లేదా పదేపదే కొట్టడం
బాల్యంలో ఒక పిల్లవాడిని ఎక్కువగా తిట్టినా లేదా పదే పదే కొట్టినా అలాంటి పిల్లవాడు నెమ్మదిగా బలహీనంగా మారడం ప్రారంభిస్తాడు. ఇలాంటి పిల్లలు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి నేనేం చేయలేనని భావించి ప్రతి విషయంలో వెనకే ఉండిపోతారు. ఒక పిల్లవాడు బాల్యంలో శారీరకంగా లేదా మానసికంగా హింసకు గురైతేనే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొలేక చతికిలపడతారు. ఈ భయం పిల్లల మనస్సులలో జీవితాంతం పాతుకుపోతుంది. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇలాంటి వారే కొన్ని సార్లు ఆత్మహత్యాయత్నాలకూ తెగబడే అవకాశం ఉంటుంది.
ఇంట్లో ఘర్షణ వాతావరణం
ఒక పిల్లవాడు రోజువారీ తగాదాలు, అరుపులు లేదా గృహ హింస ఉండే వాతావరణంలో పెరిగితే అది అతడి మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎప్పుడూ సంఘర్షణ వాతావరణం ఉండే ఇళ్లలో నివసించే పిల్లలు మానసికంగా అస్థిరంగా ఉంటారు. చిన్న విషయానికీ చిరాకు పడుతుంటారు. ఇలాంటి పిల్లల్లో ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వారు చిన్న విషయాలకు కూడా భయపడతారు. ముఖ్యంగా కొత్త వాతావరణంలో అంత సులభంగా ఇమడలేరు.
బాల్యంలో ఒంటరితనం
ఇప్పటి తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది ఆఫీసు, సొంత పనుల్లో బిజీగా ఉంటున్నారు. తమ పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు అభద్రతా భావాన్ని అనుభవిస్తారు. తన భావాలను ఎవరికీ వ్యక్తపరచలేక, పంచుకునే అవకాశం రాక లోలోపలే కుంగిపోతారు. ఇలా నిరంతరం విస్మరణకు గురైతే ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు. ఈ ఒంటరితనం క్రమంగా భయం, అభద్రతా భావనగా మారుతుంది. అలాంటి పిల్లలు ఎల్లప్పుడూ అందరి నుంచి దూరంగా ఉంటారు. నలుగురిలో కలవాలంటే భయపడతారు. తమను తాము బలహీనులుగా భావించుకుని జీవితంలో లక్ష్యాలను సాధించడంలో వెనకబడతారు.
పిల్లల భావాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం
తల్లిదండ్రులు తమ పిల్లల భావోద్వేగాలను గౌరవించనప్పుడు అది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పద్ధతి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాకుండా మానసికంగా కూడా బలహీనంగా మారుస్తుంది. పిల్లవాడు దేనికోసమైనా ఏడుస్తున్నా, భయపడుతున్నా లేదా దేని గురించైనా బాధపడుతున్నా పేరెంట్స్ కచ్చితంగా శ్రద్ధ వహించాలి. వారి భావోద్వేగాలను 'డ్రామా' లేదా 'బలహీనత' గా భావించి పట్టించుకోకుండా అస్సలు ఉండకూడదు. ఇలా చేస్తే పిల్లలు తమను తాము నమ్మడం మానేస్తారు. భావోద్వేగాలను అణచుకోవడం నేర్చుకుని లోలోపలే రగిలిపోతూ, బాధతో కుంచించుకుపోతూ ఉంటారు. ఫలితంగా పిల్లవాడు మానసికంగా బలహీనంగా మారి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
పోల్చడం లేదా ఎగతాళి చేయడం
ఒక పిల్లవాడిని ఇతర పిల్లలతో పోల్చి పదే పదే అవమానించినా లేదా ఎగతాళి చేసినా క్రమంగా ఆత్మవిశ్వాసం తగ్గడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితులు తరచూ ఎదురవుతుంటే పిల్లలు తమలోని బలాలు గుర్తించలేకపోతారు. తనకేం చేతకాదని ఇతరులకన్నా తక్కువ అని భావించడం ప్రారంభిస్తారు. అంతే కాకుండా మంచి పనిచేసినా చేయలేదని భ్రమిస్తారు.ఈ ఆత్మన్యూనతా భావం వారి మొత్తం వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. చివరకి అందరిచేతా పిరికిపంద అనే నింద అనుభవించాల్సి వస్తుంది.
Also Read:
భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త అలవాట్లు ఇవే..
ఉదయాన్నే చిరాగ్గా అనిపిస్తోందా.. ఇలా జరగడానికి కారణాలివే..
For More Lifestyle And Telugu News