Share News

Israeli Embassy Staff: వాషింగ్టన్ డీసీ యూదు మ్యూజియం వద్ద కాల్పులు..ఇద్దరు ఇజ్రాయెల్ రాయబారులు మృతి

ABN , Publish Date - May 22 , 2025 | 09:51 AM

అమెరికాలో మరోసారి కాల్పుల మోత వినిపించింది. వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి (Israeli Embassy Staff) సమీపంలో ఉన్న క్యాపిటల్ యూదు మ్యూజియం వద్ద కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Israeli Embassy Staff: వాషింగ్టన్ డీసీ యూదు మ్యూజియం వద్ద కాల్పులు..ఇద్దరు ఇజ్రాయెల్ రాయబారులు మృతి
Jewish Museum shooting, Israeli diplomats killed

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో (Israeli Embassy Staff) ఇద్దరు సిబ్బందిపై క్యాపిటల్ యూదు మ్యూజియం వెలుపల ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడు. బుధవారం సాయంత్రం 3వ వీధి, ఎఫ్ వీధి సమీపంలోని క్యాపిటల్ జ్యూయిష్ మ్యూజియం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ మ్యూజియం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉండటం విశేషం. ఈ ప్రాంతంలో జ్యూయిష్ సమాజం చరిత్ర, సంస్కృతిని ప్రదర్శించే మ్యూజియం ఉంది. ఆ సమయంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఒక వ్యక్తి ఆయుధంతో వచ్చి దాడి చేసి, ఒక పురుషుడు, ఒక మహిళపై కాల్పులు జరిపాడు.


ఇద్దరు సిబ్బంది

ఈ దాడిలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ వ్యక్తి "ఫ్రీ పాలస్తీన్" అనే నినాదాలు చేశాడు. అయితే, దాడి చేసిన వ్యక్తి గురించి అధికారులు ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. ఈ ఘటన యూదు సమాజంపై జరిగిన దాడిగా పరిగణించబడుతోంది. దీనిని ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ తీవ్రంగా ఖండించారు. ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేస్తూ, యూదు సమాజంపై దాడి చేయడం రెడ్ లైన్ దాటడం లాంటిదని పేర్కొన్నారు.


మోహరించిన పోలీసులు

ఈ ఘటన తర్వాత స్థానిక పోలీసులు, యూఎస్ క్యాపిటల్ పోలీస్, ఇతర భద్రతా సంస్థలు ఘటనా స్థలంలో భారీగా మోహరించాయి. పోలీసు వాహనాలు భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కనిపించారు. ఈ క్రమంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండి ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. బాధితుల కుటుంబాల కోసం ప్రార్థనలు చేసినట్లు ఆమె వెల్లడించారు. అదే సమయంలో, హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెం, ఈ దాడి చేసిన వ్యక్తిని న్యాయస్థానంలో నిలబెట్టి, తగిన శిక్ష పడేలా చేస్తామని ఆమె ఎక్స్‌లో వెల్లడించారు. వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌లో ఈ ఘటనను ధృవీకరిస్తూ, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.


దాడి నేపథ్యంలో

ఈ ఘటన నేపథ్యంలో స్థానిక జ్యూయిష్ సమాజంలో భయాందోళనలను రేకెత్తించింది. క్యాపిటల్ జ్యూయిష్ మ్యూజియం, వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో జ్యూయిష్ ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉంది. అయితే ఈ దాడి ఆ ప్రాంతంలో భద్రతా ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా ఇది ఎఫ్‌బీఐ కార్యాలయానికి సమీపంలో జరగడం చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు అధికారులు ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశాలను, దాడి చేసిన వ్యక్తి నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఈ దాడి యూదు సమాజంపై లక్ష్యంగా జరిగిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.


ఇవీ చదవండి:

కశ్మీర్‌ కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్..భద్రతా దళాల ఆపరేషన్


విమానంపై వడగళ్ల వాన.. 227 మంది ఉన్న ఫ్లైట్‎కు తప్పిన ఘోర ప్రమాదం..


మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 22 , 2025 | 10:36 AM