Israeli Embassy Staff: వాషింగ్టన్ డీసీ యూదు మ్యూజియం వద్ద కాల్పులు..ఇద్దరు ఇజ్రాయెల్ రాయబారులు మృతి
ABN , Publish Date - May 22 , 2025 | 09:51 AM
అమెరికాలో మరోసారి కాల్పుల మోత వినిపించింది. వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి (Israeli Embassy Staff) సమీపంలో ఉన్న క్యాపిటల్ యూదు మ్యూజియం వద్ద కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో (Israeli Embassy Staff) ఇద్దరు సిబ్బందిపై క్యాపిటల్ యూదు మ్యూజియం వెలుపల ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడు. బుధవారం సాయంత్రం 3వ వీధి, ఎఫ్ వీధి సమీపంలోని క్యాపిటల్ జ్యూయిష్ మ్యూజియం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ మ్యూజియం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్కు కొన్ని అడుగుల దూరంలో ఉండటం విశేషం. ఈ ప్రాంతంలో జ్యూయిష్ సమాజం చరిత్ర, సంస్కృతిని ప్రదర్శించే మ్యూజియం ఉంది. ఆ సమయంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఒక వ్యక్తి ఆయుధంతో వచ్చి దాడి చేసి, ఒక పురుషుడు, ఒక మహిళపై కాల్పులు జరిపాడు.
ఇద్దరు సిబ్బంది
ఈ దాడిలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ వ్యక్తి "ఫ్రీ పాలస్తీన్" అనే నినాదాలు చేశాడు. అయితే, దాడి చేసిన వ్యక్తి గురించి అధికారులు ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. ఈ ఘటన యూదు సమాజంపై జరిగిన దాడిగా పరిగణించబడుతోంది. దీనిని ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ తీవ్రంగా ఖండించారు. ఆయన ఎక్స్లో ఓ పోస్ట్ చేస్తూ, యూదు సమాజంపై దాడి చేయడం రెడ్ లైన్ దాటడం లాంటిదని పేర్కొన్నారు.
మోహరించిన పోలీసులు
ఈ ఘటన తర్వాత స్థానిక పోలీసులు, యూఎస్ క్యాపిటల్ పోలీస్, ఇతర భద్రతా సంస్థలు ఘటనా స్థలంలో భారీగా మోహరించాయి. పోలీసు వాహనాలు భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కనిపించారు. ఈ క్రమంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండి ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. బాధితుల కుటుంబాల కోసం ప్రార్థనలు చేసినట్లు ఆమె వెల్లడించారు. అదే సమయంలో, హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెం, ఈ దాడి చేసిన వ్యక్తిని న్యాయస్థానంలో నిలబెట్టి, తగిన శిక్ష పడేలా చేస్తామని ఆమె ఎక్స్లో వెల్లడించారు. వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్లో ఈ ఘటనను ధృవీకరిస్తూ, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
దాడి నేపథ్యంలో
ఈ ఘటన నేపథ్యంలో స్థానిక జ్యూయిష్ సమాజంలో భయాందోళనలను రేకెత్తించింది. క్యాపిటల్ జ్యూయిష్ మ్యూజియం, వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో జ్యూయిష్ ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉంది. అయితే ఈ దాడి ఆ ప్రాంతంలో భద్రతా ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా ఇది ఎఫ్బీఐ కార్యాలయానికి సమీపంలో జరగడం చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు అధికారులు ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశాలను, దాడి చేసిన వ్యక్తి నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఈ దాడి యూదు సమాజంపై లక్ష్యంగా జరిగిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
ఇవీ చదవండి:
కశ్మీర్ కిష్త్వార్లో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్..భద్రతా దళాల ఆపరేషన్
విమానంపై వడగళ్ల వాన.. 227 మంది ఉన్న ఫ్లైట్కు తప్పిన ఘోర ప్రమాదం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి