Share News

Abhisekh Banerjee: చర్చలంటూ జరిగితే పీఓకే పైనే.. మలేషియాలో అభిషేక్ బెనర్జీ

ABN , Publish Date - Jun 01 , 2025 | 05:02 PM

పాకిస్థాన్‌కు రెండు వారాలు వారికి సమయం ఇచ్చినప్పటికీ ఉగ్రదాడులకు పాల్పడిన ముష్కరులపై ఒక్క చర్య కూడా తీసుకోలేదని అభిషేక్ బెనర్జీ చెప్పారు. పైగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు పాల్గొనడాన్ని అంతా చూశామని అన్నారు.

Abhisekh Banerjee: చర్చలంటూ జరిగితే పీఓకే పైనే.. మలేషియాలో అభిషేక్ బెనర్జీ

కౌలాలంపూర్: పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి వివరించేందుకు ఎంపీలతో కూడిన అఖిల పక్ష బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా సారథ్యంలోని భారత ప్రతిధి బృందం మలేషియాలో ఆదివారంనాడు పర్యటించింది. కౌలాలంపూర్‌లోని భారత సాంస్కృతిక కేంద్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ప్రతినిధుల బృందం నివాళులర్పించింది. ఈ సందర్భంగా కౌలాలంపూర్‌లో జరిగిన ఎన్ఆర్ఐల సమావేశంలో ప్రతినిధి బృందం మాట్లాడింది. భవిష్యత్తులో పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను తిరిగి భారత్‌ పొందడంపైనే ఉంటాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee) ఈ సందర్భంగా తెలిపారు. ఇస్లామాబాద్‌తో గతంలో చర్చలన్నీ వృథాగానే మిగిలిపోయాయని, ఇందువల్ల దౌత్యపరంగా దృష్టి సారించడమే తక్షణావసరమని చెప్పారు.


జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలను కాల్చిచంపారని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ముష్కరులను చట్టం ముందుకు తీసుకురావడానికి పాక్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రెండు వారాలు వారికి సమయం ఇచ్చినప్పటికీ ఒక్క చర్య కూడా తీసుకోలేదని చెప్పారు. ఇందుకు బదులుగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు పాల్గొనడాన్ని అంతా చూశామని పేర్కొన్నారు. భారతదేశ చిరకాల వైఖరిని ఆయన వివరిస్తూ, పాకిస్థాన్‌తో మాటలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పొందడంపైనే ఉంటాయని, దీనికంటే తగ్గితే ఇదే తరహా హింసాత్మక ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయన్నారు.


కశ్మీర్‌కు రండి..

హింస ద్వారా అనిశ్చితి సృష్టించాలనుకునే వారికి అందరూ కలిసి గట్టి సమాధానం ఇవ్వాలని, కశ్మీర్ ప్రాంతంలో పర్యటించి, పర్యాటకం ద్వారా కశ్మీర్ ఆర్థికాభివృద్ధికి సహకరించాలని అభిషేక్ బెనర్జీ ఈ సమావేశంలో కోరారు. 'మీరు ఇండియాకు వచ్చినప్పుడు కొద్దిరోజులు కశ్మీర్‌లో గడపండి. కశ్మీర్ ఆర్థిక వృద్ధికి, ఆశావాదంపై ఉగ్రవాదం ఎప్పటికీ విజయం సాధించలేదని చాటిచెప్పేందుకు ఇదే సరైన సమయం'' అని అన్నారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న మలేషియా ఇండియన్ ముస్లింలతో సహా ఎన్ఆర్ఐలంతా ఉగ్రదాడులను ఖండిస్తూ, ఉగ్రవాదంపై భారత్ పోరుకు సంఘీభావం తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Sharmistha: పాక్ గురించి నిజం చెప్పడం తప్పా? ఆమెను వదిలేయండి.. డచ్ ఎంపీ..

Sheikh Hasina: పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు.. హసీనాపై అధికారిక అభియోగాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 05:14 PM