Imran Khan: పాక్కు దెబ్బమీద దెబ్బ.. దేశవ్యాప్త ఆందోళనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపు
ABN , Publish Date - May 28 , 2025 | 08:12 PM
2023 నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్ఖాన్ను విడుదల చేయాలంటూ పీటీఐ మద్దతుదారులు నిరసనలు వ్యక్తం చేస్తు్న్న నేపథ్యంలో సామూహిక ఆందోళనలకు ఇమ్రాన్ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీకి మునుముందు మరిన్ని గడ్డురోజులు తప్పేలా లేవు. అసలే భారత్ చేపట్టి ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)తో కుదేలయిన పాక్పై తాజాగా మరో పిడుగుపాటు పడింది. మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇస్లామాబాద్కే ఆందోళనలు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చినట్టు పాకిస్థాన్ డైలీ 'ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' ఒక వార్త కథనంలో పేర్కొంది. 2023 నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్ఖాన్ను విడుదల చేయాలంటూ పీటీఐ మద్దతుదారులు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సామూహిక ఆందోళనలకు ఇమ్రాన్ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జైలులో కనీస వసతులు కూడా లేవు
రావల్పిండి అడియలా జైలులో తనకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఇమ్రాన్ తెలిపారు. ఈ దేశానికి తాను మాజీ ప్రధానినని, జైలులో స్పెషల్ స్టాటస్కు తాను అర్హుడనని, అయితే ఇప్పటికీ తనకు సాధారణ ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. గ్రైండింగ్ మిల్ లాంటి సెల్లో 22 నెలలుగా తనను ఉంచారని చెప్పారు. దొంగలు, షరీఫ్లు, జర్దారీలకు లగ్జరీ సూట్లలాంటి వీఐపీ సెల్స్ ఇస్తున్నారని ఆరోపించారు. గత రెండున్నర నెలలుగా కొత్త పుస్తకాలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారని చెప్పారు. తానొక రాజకీయ పార్టీ అధినేతనైనప్పటికీ, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తనను కలుసుకునేందుకు పార్టీ కార్యకర్తలను సైతం అనుమతించడం లేదన్నారు.
వీటికితోడు తన భార్య బుష్రా బీబీని ఆర్మీ జైలులో పెట్టిందని, ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని ఇమ్రాన్ ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను కానీ లాయర్లను కానీ కలిసేందుకు వారంలో 30 నిమిషాలే తనను అనుమతిస్తున్నారని చెప్పారు. మిలట్రీ ట్రయల్స్కు ఆమోదం తెలపడం మినహా సొంత న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టుకు నమ్మకం లేనట్టుందని విమర్శించారు.
బంగ్లా మళ్లీ రగులుతోంది.. ఉద్యోగుల నిరసనలతో రంగంలోకి పారామిలటరీ బలగాలు
ఆ దేశానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్