Share News

Pakistan: సింధు జలాల ఒప్పందం నిలిపివేత.. పాక్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jun 02 , 2025 | 07:30 PM

పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఏడాది జూన్ 2వ తేదీకి 1,28,800 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉందని, గతేడాది ఇదే తేదీ నాటికి ఉన్న నీటి నిల్వ కంటే ఇది 14,888 క్యూసెక్యులు తక్కువని సింధు జలాల పంపిణీ రెగ్యులేటర్‌గా ఉన్న ఇండస్ రీవర్ సిస్టమ్ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) పేర్కొంది.

Pakistan: సింధు జలాల ఒప్పందం నిలిపివేత.. పాక్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఇండస్ రివర్ సిస్టమ్‌లో నీటి కొరత తీవ్రం కావడంతో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ ఈ ఖరీఫ్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌లో కీలకమైన డ్యామ్‌లైన జీలం నదిపై ఉన్న మంగ్లా డ్యామ్, సింధు నదిపై తరేబ్లా డ్యాముల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయినట్టు ఇస్లామాబాద్ చెబుతోంది. భారత్ నుంచి చీనాబ్ నదీ ప్రవాహాలు అకస్మాత్తుగా తగ్గడంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలో నీటి కొరత మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది.


పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఇండస్ వాటర్ సిస్టమ్ (పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపల)లో అందుబాటులో ఉన్న జలాల శాతం 2024 జూన్ 2తో పోల్చితే 2025 జూన్ 2 నాటికి 10.3 శాతం తగ్గింది. నైరుతి రుతుపవనాలు రావడానికి మరో నాలుగు వారాలు ఉండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంటోంది. కాగా, పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఏడాది జూన్ 2వ తేదీకి 1,28,800 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉందని, గతేడాది ఇదే తేదీ నాటికి ఉన్న నీటి నిల్వ కంటే ఇది 14,888 క్యూసెక్యులు తక్కువని సింధు జలాల పంపిణీ రెగ్యులేటర్‌గా ఉన్న ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) పేర్కొంది. దీంతో నీటి కొరత తలెత్తిందని పేర్కొంది. ప్రస్తుతం ఖరీఫ్ పంట నాటే సీజన్ నడుస్తుండటం, నైరుతి రుతుపవనాలు జులై చివరి వరకూ పంజాబ్ ప్రావిన్స్‌కు చేరే అవకాశం లేకపోవడం, తీవ్రమైన వడగాలుల వల్ల వ్యవసాయ రంగంపై ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని తెలిపింది.


ఈ వేసవిలో దేశంలోని మొత్తం నీటి ప్రవాహంలో 21 శాతం కొరతను, రెండు కీలక డ్యామ్‌లలో దాదాపు 50 శాతం నీటి నిల్వల కొరతను ఎదుర్కొంటున్నట్టు పాకిస్థాన్ గత నెలలో పేర్కొంది. రిజర్వాయర్ల నుంచి న్యాయబద్ధంగా నీటిని వాడుకోవాలని డ్యామ్ అథారిటీలను, ఇరిగేషన్ సప్లై మోనిటరింగ్ ఏజెన్సీలకు సూచించింది. పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లో ఇరిగేషన్, జల విద్యుత్ ఉత్పత్తిలో ఈ రెండు డ్యామ్‌లు కీలకపాత్ర వహిస్తున్నాయి. పాక్‌లో తలెత్తిన ప్రస్తుత నీటి సంక్షోభంపై పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గత వారంలో తజకిస్థాన్‌లో జరిగిన గ్లాసియర్ ప్రిజర్వేషన్ సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. సింధు జాలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచదేశాల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, పాక్ ఉగ్రవాదంతో తనంత తానుగా ఇండస్ ఒప్పందాన్ని కాలరాసిందని, తప్పు చేసి మరొకరిపై విమర్శించడం సరికాదని భారత్ తిప్పికొట్టింది.


'స్పైడర్ వెబ్' ఆపరేషన్.. ఉక్రెయిన్ డ్రోన్ దాడి ఎలా చేసిందో తెలిస్తే అవాక్కవుతాం

ఎగిసిపడిన అగ్నిపర్వతం.. భయాందోళనతో పర్యాటకుల పరుగు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 09:16 PM