Nawaz Sharif: ఇండియాపై దూకుడు వద్దు.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హితవు
ABN , Publish Date - Apr 28 , 2025 | 09:39 PM
లాహోర్లో ఆదివారం సాయంత్రం సోదర ద్వయం- నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా చర్యలకు ప్రతిగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను నవాజ్కు షెహబాజ్ వివరించారు.

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ ప్రజలను తక్షణం దేశం విడిచిపెట్టి వెళ్లాలని భారత్ ఆదేశించడం, పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు ప్రతిగా పాక్ సైతం తమ గగనతలం మూసివేయడం వంటి ప్రతీకార చర్యలకు దిగింది. అణ్వాయుధాల ప్రస్తావనతో పాటు, సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలకు పాక్ నేతలు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్పై ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగవద్దని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)కు ఆయన సోదరుడు, మూడుసార్లు పాక్ ప్రధానమంత్రిగా పనిచేసిన అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (పీఎంఎల్-ఎన్) వ్యవస్థాపకుడు నవాజ్ షరీఫ్ (Nawaz Sharif హితవు చెప్పారు.
Asaduddin Owaisi: మీ తల్లిని చంపిందెవరో గుర్తులేదా.. బిలావల్పై ఒవైసీ నిప్పులు..
లాహోర్లో ఆదివారం సాయంత్రం సోదర ద్వయం- నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా చర్యలకు ప్రతిగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను నవాజ్కు షెహబాజ్ వివరించారు. పహల్గాం దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్సీ) సమావేశం నిర్వహించిన విషయాన్ని, అందులో తీసుకున్న నిర్ణయాలను తన పెద్ద సోదరుడు నవాజ్కు ప్రధాని తెలిపారు. భారత్కు పాక్ గగన తలాన్ని మూసివేసినట్టు చెప్పారు. దీనిపై నవాజ్ స్పందిస్తూ, ఈ అంశంపై దూకుడుగా వ్యవహరించవద్దని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య మార్గాలను ఉపయోగించుకోవాలని తన సోదరుడికి సూచించారు.
కాగా, ఈ క్రమంలోనే పహల్గాం దాడిపై విచారణకు అంతర్జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భారత్ను కోరినట్టు తెలుస్తోంది. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ సహా వివిధ దేశాల అధికారులతో అంతర్జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూాడా చదవండి..