Operation Sindoor: భారత్లో అధికార భాషపై కనిమొళి స్పెయిన్లో ఏమన్నారంటే..
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:06 PM
డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్లో పర్యటిస్తోంది. భారతదేశ అధికార భాషపై ఈ సందర్భంగా మాడ్రిడ్లో ఎన్అర్ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాడ్రిడ్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వివరాలు, ఉగ్రవాదంపై భారత్ పోరును వివరించేందుకు విదేశాల్లో అఖిలపక్ష ఎంపీల బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi) సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్లో పర్యటిస్తోంది. భారతదేశ అధికార భాషపై ఈ సందర్భంగా మాడ్రిడ్లో ఎన్అర్ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో అధికార భాషపై అడిగిన ఒక ప్రశ్నకు తూత్తుకుడి ఎంపీ కనిమొళి సమాధానమిస్తూ, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ జాతీయ భాష అని చెప్పారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు తమ ప్రతినిధుల బృందం వచ్చిందన్నారు. ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం ఇవాళ చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని కనిమొళి చెబుతున్నప్పుడు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది రాజ్యాంగంలో పొందుపరిచారని, ఏ ఒక్క భాషను జాతీయ భాషగా ప్రకటించ లేదని, అయితే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ కింద అధికారిక భాషలుగా 22 భాషలను గుర్తించారని చెప్పారు.
ఉగ్రవాదంపై మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పోరుకు కట్టుబడి ఉన్నామని, ఆ పని చేస్తున్నామని, ఇంకా చేయాల్సింది ఉందని చెప్పారు. ఇండియా సురక్షిత దేశం అని, కశ్మీర్ సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందుకు భిన్నంగా ఎవరు ఏమి చేయాలనుకున్నా వారి ఆటలు సాగనీయమని అన్నారు. కనిమొళి ప్రతినిధుల బృందంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ కుమార్ రాయ్, బీజేపీ ఎంపీ బ్రిజేష్ చౌతా, ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్, ఆర్జేడీ ఎంపీ ప్రేమ్ చంద్ గుప్తా, మాజీ దౌత్యవేత్త మంజీవ్ సింగ్ పురి ఉన్నారు.
ఇవీ చదవండి:
నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా
పాకిస్తాన్కు షాక్.. జైలు నుంచి 200 మంది ఖైదీల పరార్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి