Jai Shankar: ప్రణాళిక ప్రకారమే పహల్గాం ఉగ్రదాడి.. షాంఘై సమావేశంలో జైశంకర్
ABN , Publish Date - Jul 15 , 2025 | 09:22 PM
ఏప్రిల్ 22 భారత్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా చూసిందని, జమ్మూకశ్మీర్లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడని జైశంకర్ పేర్కొన్నారు.

టియాంజిన్: ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు దుష్టశక్తులని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) అన్నారు. పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని మంగళవారంనాడిక్కడ జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఈ మూడు దుష్టశక్తులపై పోరాటం జరపడం ఎస్సీఓ ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటని గుర్తుచేశారు.
ఏప్రిల్ 22 భారత్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా చూసిందని, జమ్మూకశ్మీర్లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి ఇదని జైశంకర్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించిందని చెప్పారు. ఉగ్రవాదానికి పాల్పడుతూ, ప్రోత్సహిస్తున్న శక్తులను చట్టం ముందుకు తీసుకురావాలనే ఇండియా దృఢ సంకల్పాన్ని యూఎన్ పునరుద్ఘాటించిందని అన్నారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమనే సందేశం ఎస్సీఓ సమావేశం బలంగా నొచ్చిచెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆప్ఘనిస్థాన్ సుస్థిరత, సంక్షేమం కోసం భారత్ చిరకాలంగా కట్టుబడి ఉందని, ఆప్ఘన్ అభివృద్ధికి ఎస్సీఓ సభ్యదేశాలు మరింత సహకారం అందించాలని జైశంకర్ సూచించారు. గ్లోబల్ అఫైర్స్లో తమ ప్రభావాన్ని విస్తరించుకునేందుకు సభ్యదేశాలు సమష్టిగా షేర్డ్ ఎజెండాతో ముందుకు వెళ్లాలని అన్నారు. సమష్టి సామర్థ్యంతోనే ఎస్సీఓ విజయాలు సాధిస్తుందన్నారు. ఆర్థిక సహకారం కూడా చాలా కీలకమని, ఎస్సీఓ ప్రాంతంలో రవాణా మార్గాలు లేకపోవడం వంటి అవరోధాల కారణంగా వాణిజ్యం, ఇన్వెస్ట్మెంట్పై ప్రభావం చూపుతుందన్నారు. ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (INSTC)ని ప్రమోట్ చేసేందుకు రెట్టించిన ఉత్సాహంతో సభ్యదేశాలు దృష్టి సారించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి