Share News

Operation Sindoor: భారత్‌- పాక్‌ యుద్ధంపై ట్రంప్‌ సంచలన ప్రకటన..

ABN , Publish Date - May 10 , 2025 | 05:46 PM

భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా..

Operation Sindoor: భారత్‌- పాక్‌ యుద్ధంపై ట్రంప్‌ సంచలన ప్రకటన..
Operation Sindoor

న్యూఢిల్లీ, మే 10: భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా.. సంచలన పోస్ట్ చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌, పాక్‌ దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని.. సుదీర్ఘ చర్చల తర్వాత తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విరమణకు భారత్, పాక్ అంగీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు ట్రంప్.


భీకర దాడులు..

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాక్ ప్రోద్బలంతోనే ఈ ఉగ్రదాడి జరిగిందని, ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో టెర్రరిస్ట్ టాప్ లీడర్స్ కూడా ఉన్నట్లు తాజాగా భారత ప్రభుత్వం ప్రకటించింది.


చర్చలు ఫలించాయి..

భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, సైన్యాధిపతి అసిమ్ మునీర్, జాతీయ భద్రతా సలహదారులు అజిత్ దోవల్, అసిమ్ మాలిక్ సహా భారత్, పాకిస్తాన్‌కు చెందిన సీనియ్ అధికారులతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ డేవిడ్ వాన్స్, తాను 48 గంటలపాటు చర్చలు జరిపాము. ఈ చర్చల్లో పురోగతి లభించింది. తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. తటస్థ స్థితిలో విస్తృత సమస్యలపై చర్చించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రధాన మంత్రులు మోదీ, షరీఫ్‌లు అనుసరించిన విధానాన్ని అభినందిస్తున్నాం అని మార్కో రూబియో తెలిపారు.


పాక్ ప్రతిదాడి.. భారత్ ఉగ్రరూపం..

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడి చేయడంలో పాకిస్థాన్ రెచ్చిపోయింది. భారత్‌లోని 15 నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్స్ వదిలింది. అయితే, భారత్ ఈ మిస్సైల్స్‌ను ధ్వంసం చేసింది. అయినప్పటికీ.. పాక్ తన బుద్ధి మార్చుకోకుండా అటాక్ చేయడంతో.. భారత్ ప్రతిదాడులకు పాల్పడింది. దీంతో హడలిపోయిన పాకిస్థాన్.. యుద్ధం ఆపేలా చూడాలంటూ అమెరికాతో కాళ్లబేరం సాగించింది. దీంతో కల్పించుకున్న అమెరికా.. భారత్‌, పాక్‌తో సంప్రదింపులు జరిపింది. కాల్పుల విరమణకు అంగీకరింపజేసింది. ఇదే విషయాన్ని తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

Updated Date - May 10 , 2025 | 06:16 PM