Bangladesh: బంగ్లా మళ్లీ రగులుతోంది.. ఉద్యోగుల నిరసనలతో రంగంలోకి పారామిలటరీ బలగాలు
ABN , Publish Date - May 27 , 2025 | 09:35 PM
యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద 'కొత్త సర్వీసుల చట్టం'పై ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మంగళవారంనాడు నాలుగో రోజుకు చేరుకుంది.

ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh) మళ్లీ రగులుతోంది. మహ్మద్ యూనుస్ సారథ్యంలోని తొమ్మిది నెలల తాత్కాలిక ప్రభుత్వం స్థానే తక్షణం ఎన్నికల నిర్వహించాలనే డిమాండ్ ఇప్పటికే ఊపందుకుంటుండగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన ముదురుతోంది. యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద 'కొత్త సర్వీసుల చట్టం'పై ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మంగళవారంనాడు నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో సెక్రటేరియట్ వద్ద పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించారు.
సెక్రటేరియట్ క్లాంప్లక్స్కు దారితీసే ప్రధాన ఎంట్రీ పాయింట్ల వద్ద బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ), స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (ఎస్డబ్ల్యూఏటీ) యూనిట్, ఎలైట్ యాంటీ-క్రైమ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ)లను మోహరించిట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. సెక్రటేరియట్ ఏరియా చుట్టుపక్కలు ర్యాలీలు, ప్రజలు గుమిగూడటంపై ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు (డీఎంపీ) నిషేధం విధించారు. సెక్రటేరియట్ ఆవరణలోకి జర్నలిస్టులు, విజిటర్ల ప్రవేశాన్ని కూడా నిలిపివేశారు. సెక్రటేరియట్ ఆవరణలో వివిధ మంత్రులు, కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో ఆంక్షలను కఠినతరం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన
పబ్లిక్ సర్వీస్ (అమెండమెంట్) ఆర్డినెన్స్-2025ను బంగ్లా అధ్యక్షుడు ఆదివారంనాడు జారీ చేశారు. డిసిప్లినరీ అఫెన్స్లకు పాల్పడుతున్న నాలుగు క్యాటగిరీల ఉద్యోగులను షోకాజ్ నోటీసుతో ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఈ ఆర్డినెన్స్ కల్పిస్తోంది. డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ విధానానికి స్వస్తి చెబుతూ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్పై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఇది నల్ల చట్టమని ఆక్షేపిస్తూ నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. తమ రక్తం మరుగుతోందని, నల్ల చట్టాన్ని రద్దు చేయాలని, ఈ చట్టానికి ఉద్యోగులు వ్యతిరేకమని, ఎంతమాత్రం అంగీకరించేది లేదని, 18 లక్షల మంది ఉద్యోగులను ఏకతాటిపైకి తెస్తామని, పోరాటమే కానీ రాజీ పడేది లేదని నిరసనకారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
US warns Indian students: అమెరికా విద్యార్థులకు షాక్.. క్లాస్లు ఎగ్గొడితే వీసా రద్దు
Football Fans: అభిమానుల గుంపులోకి దూసుకెళ్లిన కారు..47 మందికి గాయాలు..