JNTU: జేఎన్టీయూ కాలేజీలో 500 సీట్లకు కోత..
ABN , Publish Date - May 13 , 2025 | 08:16 AM
నగరంలో కూకట్పల్లిలోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 500కు పైగా సీట్లకు కోత పడనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో అటు విద్యార్థుల్లో, ఇటు అధ్యాపక వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- అనుమతులు తెచ్చుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం
హైదరాబాద్ సిటీ: నగరంలోని జేఎన్టీయూ(JNTU) కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి 500కు పైగా సీట్లకు కోత పడనుందా అంటే అవుననే అంటున్నారు యూనివర్సిటీ సిబ్బంది. ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టే ప్రతి బ్రాంచ్కు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధనలు ఉన్నప్పటికీ వర్సిటీ ఉన్నతాధికారులు ఉదాసీన వైఖరిని అవలంభించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒకవైపు ప్రైవేటు కళాశాలలు లెక్కకుమించి కొత్త కోర్సులు పెడుతుండగా, ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న కోర్సులు/బ్రాంచ్లలో సీట్లకు కోత పెట్టాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావిస్తుండడాన్ని ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు తప్పు పడుతున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: క్రెడిట్ కార్డుకు ఫైన్ పడిందని..
ప్రైవేటు కాలేజీలకు వెనువెంటనే అనుమతులు
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు ఏఐసీటీఈ నుంచి వారంలోగా అనుమతులు లభిస్తుండగా, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశపెట్టిన కోర్సులకు ఏళ్లు గడుస్తున్నా అనుమతులు లభించడంలేదు. అనుమతుల కోసం ఏఐసీటీఈకి సరైన పత్రాలు సమర్పించడంలో అధికారులు వైఫల్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
గండిపేట్(Gandipet)లోని ఒక పేరున్న ఇంజనీరింగ్ కళాశాల వచ్చే ఏడాదికి కొన్ని కోర్సుల్లో అదనపు బ్రాంచ్ల కోసం వారం కిందటే అనుమతి తెచ్చుకోగా, బాచుపల్లిలోని మరొక పెద్ద కళాశాలకు కూడా ఈ ఏడాది కొత్త కోర్సులను ప్రారంభించేందుకు దరఖాస్తు చేసిన స్వల్ప వ్యవధిలోనే అన్ని పర్మిషన్లు లభించడం విశేషం. ఏఐసీటీఈ అనుమతులు లేని కారణంగా జేఎన్టీయూ కాలేజీలో సీట్లకు కోతపెడితే..
లాభపడేది ఆ రెండు కాలేజీలేనన్న ప్రచారం జరుగుతోంది. పలు కోర్సుల్లో సీట్ల కోత విషయమై కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, 2009లో మొదలైన ఐడీపీ కోర్సులకు అనుమతులు ఇచ్చేందుకు ఏఐసీటీఈనే నిరాకరిస్తోందని చెప్పారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన బయోటెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు ఈ ఏడాదైనా అనుమతులు వచ్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు
Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
Read Latest Telangana News and National News