Tirumala: అన్నప్రసాదం ట్రస్టుకు 6 నెలల్లో రూ.180 కోట్ల విరాళాలు
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:29 AM
వెంగమాంబ అన్నప్రసాద ట్రస్టుకు భక్తుల నుంచి ఆరు నెలల కాలంలో రూ. 180 కోట్లు విరాళంగా అందాయి. అంటే సగటున రోజుకు కోటి రూపాయలు ఈ ఒక్క ట్రస్టుకే భక్తులు సమర్పిస్తున్నారు. శ్రీనివాసుడి సమక్షంలో అన్నదానం అన్నది గొప్ప పుణ్యకార్యక్రమం కావడంతో విశేషంగా స్పందిస్తున్నారు.
తిరుమల: వెంగమాంబ అన్నప్రసాద ట్రస్టుకు భక్తుల నుంచి ఆరు నెలల కాలంలో రూ. 180 కోట్లు విరాళంగా అందాయి. అంటే సగటున రోజుకు కోటి రూపాయలు ఈ ఒక్క ట్రస్టుకే భక్తులు సమర్పిస్తున్నారు. శ్రీనివాసుడి సమక్షంలో అన్నదానం అన్నది గొప్ప పుణ్యకార్యక్రమం కావడంతో విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రస్టు వద్ద రూ.2,300 కోట్లు డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. ఈ మొత్తం మీద వచ్చే వడ్డీతోనే ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అన్నప్రసాదకేంద్రంలో ఆయుధపూజ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో ముచ్చటిస్తూ టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఈ వివరాలు తెలిపారు. 1985లో అన్నదాన కార్యక్రమం తిరుమలలో ప్రారంభించగా 1994లో శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా మారి సేవలందిస్తోంది.
టీటీడీ ఆలయాలన్నింటిలోనూ అన్నదానం
వెంగమాంబ భవనంతో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, బయట ఫుడ్ కౌంటర్ల ద్వారా కూడా అన్నప్రసాదాలు అందిస్తున్నారన్నారు. త్వరలో టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ రోజువారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం శ్రీవాణిట్రస్టు నిధులను వినియోగిస్తామన్నారు.

అన్నప్రసాద భవనంలో ఆయుధపూజ
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శుక్రవారం ఆయుధపూజ జరిగింది. అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని ఈవో అనిల్కుమార్ సింఘాల్ సత్కరించారు. కిచెన్తో పాటు కూరగాయలు నిల్వచేసే ప్రాంతాలను ఈవో పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. కాగా కిచెన్ ఆధునీకరణ సమయంలో చేయనున్న తాత్కాలిక ఏర్పాట్ల గురించి అధికారులు ఈవోకు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News