Tesla Cars: ఇండియాలో టెస్లా కార్ల తయారీ ఉందా లేదా.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:47 PM
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla Cars) గురించి షాకింగ్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ కార్లను సంస్థ తయారు చేయడానికి ఆసక్తితో లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వెల్లడించారు.

ప్రపంచంలో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా (Tesla Cars) ఇండియాలో పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని గత కొన్ని నెలలుగా ప్రచారం జరిగింది. కానీ దీనిపై తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి (H.D. Kumaraswamy) క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా తయారీని ప్రారంభించడం లేదని, బదులుగా భారతదేశంలో తన షోరూమ్లను (డీలర్షిప్లు) ప్రారంభించాలని చూస్తోందన్నారు.
అమెరికాకు అన్యాయం
దీనికి సంబంధించి టెస్లా ప్రతినిధులు మొదటి సమావేశంలో మాత్రమే పాల్గొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తర్వాత టెస్లా రెండో, మూడో సమావేశాలలో పాల్గొనలేదు. దీంతో ప్రస్తుతానికి టెస్లా కంపెనీ ఇండియాలో తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపించడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే టెస్లా భారతదేశంలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా పన్ను వ్యవస్థను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, అది అమెరికాకు అన్యాయం అవుతుందని ట్రంప్ ఇటీవల అన్నారు. ట్రంప్ ఇప్పటికే ఆపిల్ ఐఫోన్ల తయారీ కూడా ఇండియాలో వద్దని వ్యాఖ్యలు చేశారు.
ఇతర సంస్థలు..
మెర్సిడెస్-బెంజ్, స్కోడా-వోక్స్వ్యాగన్, హ్యుందాయ్, కియా వంటి పెద్ద ఆటో కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపాయని కుమారస్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం కింద ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో పాల్గొంటున్నాయి. ఈ పథకం గత సంవత్సరం నోటిఫై చేయబడింది. కానీ దీని వివరణాత్మక మార్గదర్శకాలను ఇటీవల జారీ చేశారు.
ఈ స్కీం ప్రకారం..
ప్రభుత్వం కొత్త పథకం కింద భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీని పెంచడానికి విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. ఈ పథకంలో స్థానిక ఉత్పత్తికి ప్రోత్సాహకాలు, దిగుమతి సుంకంలో రాయితీలు, స్థానిక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ విధానం ప్రకారం, కంపెనీలు 15 శాతం అతి తక్కువ సుంకంతో ఏటా 8,000 EVలను దిగుమతి చేసుకోవచ్చు. మూడు సంవత్సరాలలోపు దేశీయ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేయడానికి వారు కనీసం రూ.4,150 కోట్లు (సుమారు $500 మిలియన్లు) పెట్టుబడి చేయాల్సి ఉంటుంది.
మస్క్ భారత పర్యటన వాయిదా
టెస్లా CEO, బిలియనీర్ ఎలాన్ మస్క్ గత సంవత్సరం ఏప్రిల్లో కొన్ని ముఖ్యమైన వ్యాపార బాధ్యతల కారణంగా తన భారత పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని ఇదివరకు ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఇండియా వస్తానని చెప్పారు. కానీ కుదరలేదు. దీనిని బట్టి చూస్తే ఎలాన్ మస్క్ ఇప్పట్లో ఇండియా వచ్చేలా లేరు. టెస్లా ఇండియా తయారీలో ఆసక్తి లేకపోవడం ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కావచ్చు. కానీ యూరప్, కొరియా నుంచి కంపెనీల భాగస్వామ్యం ద్వారా భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రపంచ కేంద్రంగా మార్చడానికి సహాయపడుతుంది.
ఇవీ చదవండి:
ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి