MLFF: టోల్ గేట్లకు ఇక రాం రాం.. జియో పేమెంట్స్ బ్యాంక్తో అంతా కామ్!
ABN , Publish Date - Oct 13 , 2025 | 03:39 PM
రహదారులకు అడ్డంగా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయడం చూస్తున్నాం. ఇకిప్పుడు టోల్ ప్లాజాలు ఉండవ్. నిర్ణీత ప్రదేశాల్లో రోడ్లపైన ఏర్పాటు చేసిన కెమెరాలతో కూడిన ప్రత్యేక స్ట్రక్చర్లు ఆటోమేటిక్గా టోల్ వసూలు చేసుకుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఇది మరో రకమైన మైలురాయి. ఫలితంగా రాబోయే ఐదు సంవత్సరాలలో జాతీయ రహదారులపై 'అడ్డంకులు లేని' టోల్ వసూళ్ల వ్యవస్థ సాకారమయ్యేందుకు ఇది ఇంకో ముందడుగు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్సిడియరీ సంస్థ అయిన జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (JPBL) ఈ తరహా కాంట్రాక్ట్ మరోసారి దక్కించుకుంది. 'గురుగ్రామ్(హర్యానా)-జైపూర్(రాజస్థాన్)' మధ్య ఉన్న రెండు టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ANPR) ఆధారిత మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ కలెక్షన్ వ్యవస్థను అమలు చేయడానికి జేపీబీఎల్ కాంట్రాక్ట్ గెలిచింది.
ఏమిటీ సరికొత్త టోల్ వ్యవస్థ?
రహదారులపై ప్రయాణించేప్పుడు టోల్ గేట్ల దగ్గర వాహనదారులను ఆపి, టోల్ వసూలు చేయడం మనం ఇప్పటివరకూ చేస్తున్నాం. ఈ టోల్ వసూలు చేసేందుకు రోడ్లకు అడ్డంగా పెద్దఎత్తున టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి, అక్కడ టోల్ వసూలు కోసం సిబ్బందిని పెట్టి పని పూర్తి చేసేవారు. అయితే, ఇక మీదట ఇలాంటి వ్యవస్థకు కాలం చెల్లిపోబోతోంది. ఎలాగంటే.. రోడ్ల మీద టోల్ ప్లాజాలు ఉండవు. ఆయా నిర్ణీత ప్రదేశాల్లో రహదారులపైన కెమెరాలతో కూడిన ప్రత్యేక స్ట్రక్చర్లు ఏర్పాటు చేస్తారు. ఇవి వాహనాల నెంబరు ప్లేట్లను గుర్తించి ఆటోమేటిక్ గా టోల్ వాటికవే వసూలు చేసుకుని ఖాతాలో జమ చేసుకుంటాయి. దీని వల్ల వాహన దారులు రోడ్ల మీద ఆగాల్సిన పని ఉండదు. ఈ కొత్త విధానం వల్ల ప్రయాణ సమయం, ఇంధనం, ఖర్చులు బాగా ఆదా అవుతాయి. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. టోల్ ప్లాజాల దగ్గర పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితులు ఉండవు.
హైవేల మీద ఈ తరహా టోల్ వసూలు సేవలందించేందుకు ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) జారీ చేసిన ఒక టెండర్ను ఇవాళ(సోమవారం) జియో పేమెంట్స్ బ్యాంక్ దక్కించుకుంది. ఈ MLFF వ్యవస్థ ఆధునిక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ టెక్నాలజీగా పనిచేస్తుంది. రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID), డెడికేటెడ్ షార్ట్-రేంజ్ కమ్యూనికేషన్ (DSRC), గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) వంటి టెక్నాలజీలతో ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 టోల్ ప్లాజాల్లో ఈ తరహా టోల్ ఆపరేషన్స్ను మేనేజ్ చేస్తున్న JPBLకు ఇది ఐదో MLFF బిడ్.
ఈ కాంట్రాక్ట్తో భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిజిటల్ పేమెంట్స్ భవిష్యత్తును రూపొందించడంలో జియో పేమెంట్స్ బ్యాంక్ ముఖ్య పాత్ర పోషిస్తుందని నిఫుణులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా JFSL ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ తాజా డెవలప్మెంట్ భారతీయ రోడ్డు రవాణా వ్యవస్థను మరింత స్మూత్గా మార్చడంలో కీలకమైందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి..
జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే
సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News