SEBI Jane Street: భారత స్టాక్ మార్కెట్లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్పై సెబీ కఠిన చర్యలు
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:30 PM
1992లో హర్షద్ మెహతా స్కాం భారత స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన చేసిన తర్వాత, ఇటీవల మరో పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఐదు వేల కోట్లు కాగా, ఈసారి మాత్రం రూ.36 వేల కోట్లకుపైగా స్కాం (SEBI Jane Street) జరిగినట్లు తెలుస్తోంది.

భారత స్టాక్ మార్కెట్లో (stock market) 1992 స్కాం గురించి వినే ఉంటారు. అప్పట్లో దాదాపు 5 వేల కోట్లకు పైగా స్కాం జరిగింది. ఈ క్రమంలో తాజాగా భారత స్టాక్ మార్కెట్లో మరో స్కాం జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థల్లో ఒకటైన జేన్ స్ట్రీట్ (SEBI Jane Street).. భారత ఇన్వెస్టర్లను మోసం చేసి మార్కెట్ను మానిప్యులేషన్ చేసిందని సెబీ ఆరోపించింది. ఆ క్రమంలో రూ. 36,671 కోట్ల భారీ లాభాలను ఆర్జించిందని సెబీ తెలిపింది. దీంతో ఈ సంస్థను ప్రస్తుతం మార్కెట్ నుంచి నిషేధించారు.
జేన్ స్ట్రీట్ సంస్థ ఏంటి
జేన్ స్ట్రీట్ అనేది 3,000 మందికి పైగా ఉద్యోగులతో, 45 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ. గత ఏడాది, భారత మార్కెట్లో అత్యంత లాభదాయకమైన ఆప్షన్స్ ట్రేడింగ్ వ్యూహాన్ని రూపొందించినట్లు ఈ సంస్థ గురించి వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ సంస్థపై సెబీ గుర్తించిన అక్రమాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెబీ దర్యాప్తులో జేన్ స్ట్రీట్ రెండు ప్రధాన వ్యూహాలను ఉపయోగించినట్లు తేలింది.
రెండు విధాలుగా..
మార్నింగ్ పంప్, ఆఫ్టర్ నూన్ డంప్ వ్యూహం. ఆ క్రమంలో ఉదయం స్టాక్స్, ఫ్యూచర్స్ను భారీగా కొనుగోలు చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలను పెంచేవారు. మధ్యాహ్నం తర్వాత, వాటిని భారీగా విక్రయించేవారు. దీనివల్ల మార్కెట్ బలంగా ఉన్నట్లు సామాన్య ఇన్వెస్టర్లు భావించి పెట్టుబడులు పెట్టేవారు. కానీ చివరకు మార్కెట్ పడిపోవడంతో వారు నష్టపోయేవారు. మరో విధానంలో ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజుల్లో మానిప్యులేషన్. ఆప్షన్స్ కాంట్రాక్ట్ల చివరి రోజున మార్కెట్ ముగిసే సమయంలో భారీ ట్రేడ్లు చేసి సూచీలను తమకు అనుకూలంగా మార్చేవారు. దీనివల్ల వారి ఆప్షన్స్ పొజిషన్స్ నుంచి భారీ లాభాలు పొందేవారు.
జేన్ స్ట్రీట్పై సెబీ చర్యలు
ఈ క్రమంలో జేన్ స్ట్రీట్కు సంబంధించిన నాలుగు సంస్థలైన JSI ఇన్వెస్ట్మెంట్స్, JSI2 ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ సింగపూర్ Pte Ltd, జేన్ స్ట్రీట్ ఆసియా ట్రేడింగ్ భారత మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా నిషేధించబడ్డాయి. వీటి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు ఉపసంహరణకు కూడా అనుమతి నిషేధించారు. ఫిబ్రవరిలో సెబీ హెచ్చరించినప్పటికీ, జేన్ స్ట్రీట్ ఈ అక్రమ ట్రేడింగ్ను కొనసాగించింది. దీంతో సెబీ చర్యలు తీసుకుంది. జేన్ స్ట్రీట్ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ, ఈ కేసు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద మానిప్యులేషన్ కేసుల్లో ఒకటిగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి
చమురు తీసుకుంటే భారత్పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి