Share News

Pranav Adani: అదానీ గ్రీన్‌ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

ABN , Publish Date - May 03 , 2025 | 05:34 AM

అదానీ గ్రూప్‌ సంస్థలో 2021 మే నెలలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో ప్రణవ్‌ అదానీ దోషిగా తేలింది. సెబీ దర్యాప్తులో ఆయన కీలక సమాచారాన్ని బావ మరిది కునాల్‌ షాకు ముందే చేరవేయడంతో ట్రేడింగ్ జరిగింది.

Pranav Adani: అదానీ గ్రీన్‌ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

  • గౌతమ్‌ అదానీ బంధువు ప్రణవ్‌ అదానీ దోషి:సెబీ

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ సంస్థ.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లలో 2021 మే నెలలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దోషులెవరో సెబీ నిగ్గు తేల్చింది. ఈ మొత్తం తతంగంలో అదానీ గ్రూప్‌ ప్రధాన ప్రమోటర్‌ గౌతమ్‌ అదానీ దగ్గరి బంధువు ప్రణవ్‌ అదానీ ప్రధాన పాత్రదారి అని సెబీ దర్యాప్తులో తేలింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ.. ఎస్‌బీ ఎనర్జీ హోల్డింగ్స్‌ అనే సంస్థను 350 కోట్ల డాలర్లకు కొనబోతోందన్న కీలక విషయాన్ని ప్రణవ్‌ అదానీ తన బావ మరిది కునాల్‌ షాకు రెండు మూడు రోజల ముందే చేరవేశాడు. దాంతో కునాల్‌ అతడి సోదరుడు నృపుల్‌.. అదానీ గ్రీన్‌ఎనర్జీ షేర్లలో ట్రేడింగ్‌ చేసి రూ.90 లక్షల మేర వెనకేశారని సెబీ దర్యాప్తు తేల్చింది. ప్రణవ్‌ అదానీ కాల్‌ రికార్డులు, కునాల్‌, నృపుల్‌ ట్రేడింగ్‌ ఆధారంగా సెబీ ఈ నిర్ణయానికి వచ్చింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ కుమారుడే ప్రణవ్‌.


సెటిల్‌మెంట్‌ కోసం యత్నాలు: ప్రణవ్‌ అదానీ అనేక అదానీ గ్రూప్‌ కంపెనీల బోర్డుల్లో సభ్యుడు కూడా. సెబీ దర్యాప్తులో దొరికిపోవడంతో ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఆ కేసు సెటిల్‌ చేసుకునేందుకు సెబీతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. సెబీ నిబంధనల ప్రకారం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తమ నేరాన్ని ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సెబీ విధించే జరిమానా చెల్లించి ఆ కేసులను సెటిల్‌ చేసుకోవచ్చు. అయితే కునాల్‌ సోదరులు మాత్రం ఈ విషయంలో ఇంకా సెబీతో సెటిల్‌మెంట్‌కు ముందుకు రాలేదు. ప్రమోటర్ల మద్దతుతో అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరుగుతోందని ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ ఆరోపణల్లో ఒకటి నిజమని సెబీ తేల్చింది.

Updated Date - May 03 , 2025 | 05:36 AM