Yupix Creations Scam: యానిమేషన్ సంస్థ నిర్వాహకుడి ఐపీ
ABN , Publish Date - May 02 , 2025 | 05:44 AM
యూపిక్స్ క్రియేషన్స్ యానిమేషన్ సంస్థ నిర్వాహకుడు లక్ష్మీకిరణ్ దివాలా పిటిషన్ దాఖలు చేశారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన అనేక మంది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు.

బాధితుల్లో అత్యధికులు నరసరావుపేటవాసులే
నరసరావుపేట, మే 1(ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీల ఆశచూపి భారీగా పెట్టుబడులు సేకరించిన యూపిక్స్ క్రియేషన్స్ యానిమేషన్ సంస్థ నిర్వాహకుడు నిడుమోలు వెంకట సత్య లక్ష్మీకిరణ్ కోర్టులో దివాలా పిటిషన్(ఐపీ) దాఖలు చేశారు. బాధితుల్లో ఎక్కువమంది పల్నాడు జిల్లా నరసరావుపేట వాసులే ఉన్నారు. విజయవాడకు చెందిన లక్ష్మీకిరణ్.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టులో ఐపీ దాఖలు చేశారు. 2014లో యూపిక్స్ క్రియేషన్స్ను ఏర్పాటు చేసి రూ.155.95 కోట్ల పెట్టుబడులు సేకరించినట్లు ఐపీలో పేర్కొన్నారు. 102 మంది బాధితుల జాబితాను కూడా కోర్టుకు సమర్పించారు. రూ.2.72 కోట్లు మాత్రమే ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే రూ.400 కోట్లకుపైగా వసూలు చేసి, ఐపీలో రూ.155.95 కోట్లు మాత్రమే చూపుతున్నాడని బాధితులు వాపోతున్నారు.
ఇదే సంస్థలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందారు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ తదతర ప్రాంతాల వారు కూడా బాధితులుగా ఉన్నారు. నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి రూ.15 కోట్లు, వ్యాపారి రూ.15.50 కోట్లు, ఇంకో వ్యక్తి రూ.5 కోట్లు, మరొకరు రూ.18 కోట్లు, ఇంకొకరు రూ.12 కోట్లు, మరికొందరు కోటి నుంచి 4 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. లక్ష్మీకిరణ్ ఓ పథకం ప్రకారం మూడేళ్లలో రూ.400 కోట్ల పెట్టుబడులు సేకరించాడని, ఐపీలో మాత్రం రూ.155.95 కోట్ల అప్పులే చూపాడని, మిగతా సొమ్మును ప్రస్తావించలేదని బాధితులు అంటున్నారు. ఇటీవల లక్ష్మీకిరణ్ బోర్డు తిప్పేయడంతో కొంతైనా సొమ్ము తిరిగి వస్తుందని ఇప్పటి వరకు ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఐపీ వేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. అప్పులు చేసి ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఇద్దరు వ్యాపారులు తమ ఆస్తులను విక్రయించి ఆ బాకీలు తీరుస్తున్నట్లు తెలిసింది.