Chalo Peruru Protest: పరామర్శ పేరుతో హల్చల్
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:11 AM
పరామర్శల ముసుగులో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలికపై అత్యాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేందుకు...

అత్యాచారాన్ని రాజకీయం చేసేందుకు వైసీపీ కుతంత్రం
‘హెలిప్యాడ్’ ఘటనలా రెచ్చగొట్టే కుట్ర!
ఉద్రిక్తతల సృష్టికి ‘చలో పేరూరు’కు పిలుపు
టీడీపీ విజయోత్సవ ర్యాలీ ఉండడంతో అనుమతి నిరాకరించిన పోలీసులు
అయినా 3 వాహనాల్లో తరలిన వైసీపీ కార్యకర్తలు
ర్యాలీకి ఎదురుగా వెళ్లి ఈలలు, కేకలతో కవ్వింపు
టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడులు
తెలుగు తమ్ముళ్ల ఎదురుదాడులు
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, మాజీ మంత్రి నాగార్జునను మద్దెలచెరువులోనే అడ్డుకున్న పోలీసులు
ధర్మవరం/రామగిరి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): పరామర్శల ముసుగులో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలికపై అత్యాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు ప్రయత్నించారు. సదరు బాలిక కుటుంబసభ్యులను పరామర్శించే పేరుతో ‘చలో పేరూరు’కు పిలుపు ఇచ్చి అరాచకాలకు దిగారు. రామగిరి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగిన విషయం ఇటీవల వెలుగుచూసింది. పోలీసుల అనుమతి లేకున్నా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి గురువారం ‘చలో పేరూరు’కు పిలుపునిచ్చారు. వాస్తవానికి అక్కడ గురువారం కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. వైసీపీ వాళ్లు కూడా వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు ‘చలో పేరూరు’కు అనుమతి నిరాకరించారు. అయినా వైసీపీ కార్యకర్తలు కొందరు పొరుగూళ్ల నుంచి 3 మూడు వాహనాల్లో అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ వందలాది టీడీపీ కార్యకర్తలు, నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వైసీపీ వాళ్లు వాహనాల్లో పార్టీ జెండాలు చేతపట్టుకుని, ఈలలు, కేకలు వేస్తూ ర్యాలీకి ఎదురుగా వచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. టీడీపీ వాళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఎదురుదాడులకు దిగారు. వైసీపీ మూకల వాహన అద్దాలు పగిలిపోయాయి. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
చివరకు వైసీపీ వాళ్లు తమ వాహనాల్లో వెనుదిరిగిపోయారు. ఇంకోవైపు.. తోపుదుర్తి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఉమ్మడి అనంతపురం జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం నుంచి పేరూరుకు బయల్దేరారు. మార్గమధ్యంలో కనగానపల్లి మండలం మద్దెలచెరువులో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెళ్లడానికి అనుమతి లేదని ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ తేల్చిచెప్పారు. అలాగే పేరూరుకు వెళ్తున్న వైసీపీ శింగనమల ఇన్చార్జి సాకే శైలజానాథ్ను కూడా చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేటులో పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగారు.
అప్పుడూ ఇలానే..
రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ ఏడాది ఏప్రిల్ 8న వచ్చిన సమయంలో కూడా వైసీపీ మూకలు హెలిప్యాడ్ వద్ద నానా బీభత్సం చేశాయి. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిందంటూ పైలట్లు జగన్ను వదిలేసి వెళ్లారు. ఇలా.. పరామర్శ పేరుతో వైసీపీ వాళ్లు పథకం ప్రకారమే ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.