Trial Run: యోగాంధ్ర కార్యక్రమానికి ట్రయిల్ రన్
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:28 PM
Yoga Andhra: ఈ నెల 21న (శనివారం) విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్తో పాటు, శాసన సభ్యులు కోళ్ల లలితకుమారి, జిల్లా అధికారులు గురువారం ట్రయిల్ రన్ నిర్వహించారు.

Vizianagaram: అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్బంగా ఈ నెల 21వ తేదీ (శనివారం) విశాఖ (Visakha)లో ప్రతిష్టాత్మకంగా జరిగే యోగాంధ్ర (Yoga Andhra) కార్యక్రమానికి విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్తో పాటు ఎస్ కోట శాసన సభ్యులు కోళ్ల లలితకుమారి, జిల్లా అధికారులు ఆనందపురం జుంక్షన్ నుంచి బస్సులో ప్రయాణించి ట్రయల్ రన్లో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నుంచి 30 వేల మంది పాల్గొన్నారు. విజయనగరం నుంచి విశాఖలో జరిగే యోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు. ముందుగానే ట్రయిల్ రన్ చేపట్టారు.
బస్సులో కలెక్టర్, ఎమ్మెల్యే..
ఇందుకోసం గురువారం 10 బస్సుల్లో కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు, యోగాలో పాల్గొనేవారు ట్రయిల్ రన్లో పాల్గొన్నారు. నాలుగు మండలాల నుంచి సుమారు 100 మందికిపైగా విశాఖపట్నం బయలుదేరారు. యోగలో పాల్గొనే ప్రజలు, విద్యార్థులు, అధికారులను ఉత్సాహ పరిచేందుకు ఇంత దూరం బస్సుల్లో ప్రయాణం చేసిన కలక్టర్ను పలువురు అభినందించారు.
సత్తా చాటిన జిల్లా వాసులు..
కాగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో జిల్లా వాసులు సత్తాచాటారు. జిల్లా పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయికి వెళ్లిన వారు మొత్తంగా 10 బహుమతులు సాధించి పార్వతీపురం మన్యాన్ని ద్వితీయ స్థానంలో నిలబెట్టారు. ఈ నెల 16, 17 తేదీల్లో 13 విభాగాల్లో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించారు. ఇందులో 10 విభాగాల్లో జిల్లా వాసులు విజేతలుగా నిలిచారు. మూడు ప్రథమ, రెండు ద్వితీయ, మూడు తృతీయ బహుమతులను దక్కించుకున్నారు.
విజేతలుగా నిలిచిన వారు...
యోగా సోలో (19 నుంచి 35 సంవత్సరాలు) విభాగంలో జిల్లాకు చెందిన సీహెచ్ దీపక్నాయుడు, పాటల పోటీల్లో పి.భాగ్యరాధ, షార్ట్ఫిల్మ్ పోటీల్లో కె.జనార్థనరావులు ప్రథమస్థానంలో నిలిచారు. 35 సంవత్సరాల పైబడిన వారికి నిర్వహించిన యోగా పోటీల్లో వై.కైలాసరావు ద్వితీయ స్థానం దక్కించు కున్నారు. ఆయనకు రూ. 30 వేలు నగదు బబహుమతి అందించారు. 25 సంవత్సరాలు పైబడిన వారికి నిర్వహించిన యోగా గ్రూప్ పోటీల్లో అనిల్కుమార్శర్మకు ద్వితీయ బహుమతి లభించింది. 19 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వారికి నిర్వహించిన యోగా, వ్యాసరచన పోటీల్లో కె.శిరీష్కు రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతి లభించింది. షార్ట్ఫిల్మ్ పోటీల్లో ఎం.ఇంద్రాని, గ్రూప్ యోగా పోటీల్లో జిల్లాకు చెందిన సూర్య గంటి బృందం మూడో స్థానం దక్కించుకున్నారు. యోగా పోస్టర్ జూనియర్ విభాగంలో కె.హేమమాలి, యోగా స్కిట్ రోల్ప్లేడ్లో డి.దినేష్కుమార్ బృందం తృతీయ బహుమతి పొందారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు మంత్రులు సత్యకుమార్యాదవ్, కందుల దుర్గేష్ బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన జిల్లావాసులను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా నుంచి నోడల్ అధికారిగా వెళ్లిన గిరిజన సంక్షేమశాఖాధికారి కృష్ణవేణి, జిల్లా పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ రఘు, ఆయుష్ డిపార్ట్మెంట్ కన్వీనర్ వర్మ, యోగా గురువు మోహన్ గంట, యూత్ అధికారులు జిల్లా నుంచి విజయవాడ వెళ్లిన జిల్లావాసుల బృందానికి అన్నింటా అండగా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News