Share News

Police Custody: నాలుగో రోజు సిరాజ్, సమీర్ పోలీస్ కస్టడీ..

ABN , Publish Date - May 26 , 2025 | 11:26 AM

Police Custody: ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌, సయ్యద్‌ సమీర్‌ల విచారణ కొనసాగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్‌ఐఏ, ఏటీఎస్‌ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి ఐబీ టీమ్ విజయనగరం చేరుకుంది.

Police Custody: నాలుగో రోజు సిరాజ్, సమీర్ పోలీస్ కస్టడీ..
Siraj Sameer Police Custody

విజయనగరం: ఉగ్ర లింకుల కేసు (Terror Links Case)లో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఉగ్రవాద సానుభూతిపరులతో సంబంధాలున్న సిరాజ్ (Siraj), సమీర్‌ (Sameer)ను వారం రోజుల కస్టడీకి (Police Custody) కోర్టు (Court) అనుమతి ఇవ్వడంతో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో సిరాజ్, సమీర్ పోలీస్ కస్టడీ సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. ఢిల్లీ నుంచి ఐబీ టీమ్ విజయనగరం చేరుకుంది. ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, తెలుగు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్‌బీ బృందాలు విజయనగరంలో మకాం వేశాయి. మూడు రోజులుగా జరిగిన విచారణలో నిందితులు ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. కాగా దేశ, విదేశాలకు సిరాజ్, సమీర్ నెట్‌వర్క్ విస్తరించింది. వరంగల్‌కు చెందిన మొహిద్దీన్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బాధల్, మరో ఆరుగురు కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సామాజిక మాధ్యమాలలో సిరాజ్, సమీర్‌లు జరిపిన పూర్తి చాటింగ్‌పై దర్యాప్తు బృందాలు ఓ అవగాహనకు వచ్చాయి.


కాగా, ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌, సయ్యద్‌ సమీర్‌ల విచారణ కొనసాగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్‌ఐఏ, ఏటీఎస్‌ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు వేగవంతం చేశారు. మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన ఏటీఎస్‌ అధికారులూ విజయనగరంలోని పోలీస్‌ శిక్షణ కళాశాలకు చేరుకున్నారు. సిరాజ్‌, సమీర్‌ల ద్వారా విజయనగరం సహా పలు ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు, ఐసిస్‌ లేదా ఇతర ఉగ్ర సంస్థలు వారిని ప్రేరేపించినట్లు విచారణలో నిర్ధారణకు వచ్చారని సమాచారం. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. సిరాజ్‌ కుటుంబం, అతని స్నేహితుల గురించి ఆరా తీశారు. సిరాజ్‌ ల్యాప్‌టాప్‌లో ఉన్న వివిధ అంశాలపైనా కూపీ లాగారు.

Also Read: పబ్‌లో పార్టీ.. తెల్లారేసరికి యువకుడు మృతి..


సిరాజ్‌ గత నవంబర్ 22న ముంబైకి వెళ్లినప్పుడు 10 మందితో కలిసి హక్‌ ఇండియాలో లైవ్‌ సెషన్‌కు హాజరైనట్లు విచారణలో తెలిసింది. అక్కడ ఎవరెవరిని కలిశాడు.. అక్కడి నుంచి ప్లాన్‌, పేలుడు సామగ్రి తీసుకువచ్చాడా? అనే కోణంలోనూ అధికారులు కూపీ లాగుతున్నారు. అదే విధంగా ఈ ఏడాది జనవరి 26 ఢిల్లీకి ఏ పని మీద వెళ్లాడు.. అక్కడ ఎవరిని కలిశాడనీ ప్రశ్నించారని తెలిసింది. బిహార్‌కు చెందిన అబూతాలెం అలియాస్‌ అబూముసబ్‌ సూచనలతో సిరాజ్‌, సమీర్‌లు సిగ్నల్‌ యాప్‌ ద్వారా జిహాదీ కార్యక్రమాలను తెలుసుకునేవారు. ఇందుకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఇతరుల ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుని అటువైపు ఆకర్షితులైనట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.

గోషామహల్‌ ఎమ్మెల్యేపై ద్వేషం ఉండేదని, అతను పెట్టిన వీడియోలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు సిరాజ్‌ తెలిపినట్లు సమాచారం. ఈ పోస్టులను చూసిన విశాఖలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి తనను మెచ్చుకున్నట్లు విచారణలో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు సిరాజ్‌, సమీర్‌ ఆరోగ్య పరిస్థితిపై అధికారులు శ్రద్ధ తీసుకుంటున్నారు. వైద్యులు తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారికి ఆహారం అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్టు మృత దేహాల తరలింపులో అడ్డంకులు...

జమ్మలమడుగు శివారెడ్డి కాలనీలో దారుణం

For More AP News and Telugu News

Updated Date - May 26 , 2025 | 11:44 AM