Andhrajyothy: ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’కు విశేష స్పందన
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:12 PM
Andhrajyothy: గాజువాక పరిధిలోని తిరుమలనగర్లో ఆంధ్రజ్యోతి ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య హాజరయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

విశాఖపట్నం: ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ (Aksharame Andaga Parishkarame Agendaga)గా నినాదంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి మార్గం చూపింది ఆంధ్రజ్యోతి. విశాఖ (Visakha), గాజువాక, తిరుమలనగర్లోనూ పలు సమస్యలను గుర్తించిన ఆంధ్రజ్యోతి.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆ సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేసింది. ఈ నేపథ్యంలో తిరుమలనగర్లో సోమవారం నాడు ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ బోండా జగన్, తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు.. వేమూరి ఆదిత్య, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఇతర నాయకులు ఆంధ్రజ్యోతి చొరవతో పరిష్కరించిన సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజీవ్ నగర్-వడ్లపూడి తిరుమలనగర్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఎమ్మెల్యే, ఆదిత్య పచ్చ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. అదే బస్సులో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించారు. అనంతరం స్థానిక స్కూళ్లో పరిష్కరించబడిన సమస్యలను కూడా వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా స్కూళ్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ లీడర్స్, అధికారులతో పాటు.. స్థానిక ప్రజలు సైతం భారీగా పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే ఆంధ్రజ్యోతి అక్షరం అండగా.. పరిష్కారం అజెండాగా కార్యక్రమం చేపట్టిందన్నారు. తిరుమలనగర్లో జనవరిలో తమకు చెప్పిన సమస్యల్లో.. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సహకారంతో 70 నుండి 80 శాతం సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. మిగతా అభివృద్ధి పనులు ప్రాసెస్లో ఉన్నట్లు చెప్పారు. కాలుష్య సమస్య పరిష్కారమైందని.. డంపింగ్ యార్డ్ మూతపడిందన్నారు. 14 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ కూడా నిర్మించారని ఆదిత్య తెలిపారు. తిరుమలనగర్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేశారన్నారు. ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. కొత్తగా ఆర్టీసీ సర్వీస్ని ప్రారంభించారని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కన్వైన్ స్థలాన్ని చదును చేశారన్నారు. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆదిత్య తెలిపారు. తమకు సహకరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, పల్లా శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్, అధికారులకు ఆదిత్య ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రజ్యోతి ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’గా నినాదంతో చేపట్టిన విజయోత్సవ సభలో.. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ‘అక్షరమే అండగా.. అభివృద్ధి అజెండాగా’.. పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆంధ్రజ్యోతిపై ప్రశంసలు కురిపించారు. ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నారని.. ప్రజా పక్షాన ఉండి పోరాడారన్నారు. ప్రజల సమస్యలు చెప్పి.. వాటి పరిష్కారం దిశగా పనిచేశారని ఎమ్మెల్యే కొనియాడారు. సమాజంలో జరుగుతున్న దురాగతాలపై పోరాడాలని కోరుతున్నామన్నారు.
ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ అంశంపై ఎమ్మెల్యే స్పందించారు. రాజకీయ నాయకులుగా, ప్రభుత్వాలుగా సహాయం చేయగలం గానీ.. స్టీల్ ప్లాంట్ను తాము నడపలేమన్నారు. ప్రజల డబ్బుతోనే సహాయం చేశాం.. బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులు, యాజమాన్యం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ని నడిపించాల్సిన బాధ్యత.. యాజమాన్యం, కార్మికుల మీద ఉందన్నారు. పూర్తిస్థాయి కెపాసిటీతో కష్టపడి పని చేస్తే కచ్చితంగా లాభాల బాటలోకి వస్తుందన్నారు. ఘోస్ట్ ఎంప్లాయిస్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు 430 మంది ఇలా సంతకాలు పెట్టి.. అలా వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్ కార్డ్ హోల్డర్స్కు ఉద్యోగాల బాధ్యతను తానే తీసుకుంటానన్నారు ఎమ్మెల్యే.
గాజువాక సమీపాన ఆటోనగర్ను ఆనుకుని ఉన్న తిరుమలనగర్ ప్రజలు పరిశ్రమల కాలుష్యంతో అల్లాడిపోయేవారు. మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా సక్రమంగా ఉండేది కాదు. చీకటి పడితే అంతా అంథకారమే. ఆయా సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. పరిష్కారానికి కృషి చేసింది. తిరుమలనగర్లో ఈ ఏడాది జనవరి 28న ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండా’గా నినాదంతో చేపట్టిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ బొండా జగన్తో పాటు జీవీఎంసీ, రెవెన్యూ, పోలీస్, ఏపీఐఐసీ, విద్యుత్ శాఖాధికారులు హాజరయ్యారు. అక్కడి ప్రజలు చెప్పినవన్నీ విన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అధికారులు వాటికి పరిష్కారం చూపించారు. డంపింగ్ యార్డుగా మారిన ఏపీఐఐసీ ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. అక్కడ ఉన్న చెత్తను తరలించారు. అలాగే కాలనీలోకి వస్తున్న మురుగు నీటిని మళ్లించేందుకు డైవర్షన్ కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టారు. గెడ్డల్లో మురుగునీరు నిల్వ లేకుండా 15 రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు. లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి అదనపు ట్రాన్స్ఫార్మర్ను వేశారు.
Also Read: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
అదే విధంగా వడ్లపూడిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాన్ని తహశీల్దార్, సిబ్బంది పరిశీలించి బోర్డులు పెట్టారు. ఆ స్థలంలో లైబ్రరీ, వృద్ధాశ్రమం నిర్మించే ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నారు. స్థానిక యువతకు క్రీడా సదుపాయం కోసం ఖాళీగా ఉన్న 4.5 ఎకరాల జీవీఎంసీ స్థలంలో రూ1.15 కోట్లతో ప్రహరీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. కాలనీవాసులకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు బస్సును నడపబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తిరుమలనగర్లోని ఆర్యవైశ్య సామాజిక భవన్లో ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో సభ జరగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ‘ఆంధ్రజ్యోతి’ ఎగ్జిక్యూటీ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, కార్పొరేటర్ బొండా జగన్, జీవీఎంసీ జోనల్ కమిషనర్, ఐలా కమిషనర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై హరీష్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
For More AP News and Telugu News