Visakhapatnam Covid Case: విశాఖలో తొలి కొవిడ్ మృతి
ABN , Publish Date - May 30 , 2025 | 04:37 AM
విశాఖలో 64 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయి మృతి చెందాడు. అయితే, ఆయన మరణానికి కారణం ఇతర ఆరోగ్య సమస్యలేనని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు.

64 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఆ మరణం కరోనాతో కాదు..
డీఎంహెచ్ఓ ప్రకటన
విశాఖపట్నం, మే 29(ఆంధ్రజ్యోతి): కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. విశాఖపట్నంలో గురువారం తొలి కొవిడ్ మరణం నమోదైంది. హెచ్బీ కాలనీకి చెందిన 64 ఏళ్ల వ్యక్తి న్యుమోనియా, బీపీ, షుగర్ తదితర రుగ్మతలతో బాధపడుతూ చికిత్స కోసం మూడు రోజుల క్రితం ప్రభుత్వ అతిథి గృహానికి సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రైవేటు ల్యాబ్లో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ అని తేలింది. ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. పరిస్థితి విషమించి గురువారం ఉదయం 7.41 గంటలకు మృతి చెందాడు. మృతదేహానికి జ్ఞానాపురం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ‘విశాఖపట్నంలో కరోనాతో ఎవరూ మరణించలేదు. అరవై ఏళ్లు దాటిన ఓ వ్యక్తి కరోనాతో మరణించినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఆ వ్యక్తి ఇతర కారణాలతో మరణించారు. కొవిడ్ మరణంగా ధ్రువీకరించాలంటే విశాఖ కేజీహెచ్లోని వీడీఆర్ఎల్ లేబొరేటరీలో ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ రావల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారు ఎవరూ చనిపోలేదు’ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగరంలో మూడు కేసులు నమోద య్యాయి. గతంలో పిఠాపురం కాలనీలో రెండు కేసులు నమోదవగా బాధితులు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు.