Share News

Chandrababu: విశాఖలో ఏవియేషన్‌ వర్సిటీ

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:53 AM

విశాఖపట్నంలో సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. దానికితగ్గ పరిశీలన చేయాలని కోరారు.

Chandrababu: విశాఖలో ఏవియేషన్‌ వర్సిటీ

  • పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన

  • విజయవాడ విమానాశ్రయం పనులపై సమీక్ష

అమరావతి/న్యూఢిల్లీ, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. దానికితగ్గ పరిశీలన చేయాలని కోరారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ భవనాల పనుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. దీనికి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. విజయవాడ విమానాశ్రయం టెర్మినల్‌ భవనం డిజైన్‌లు అత్యంత ఆకర్షణీయంగానూ, విభిన్నంగానూ ఉండాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారిని అనుసంధానం చేసేలా ర్యాంప్‌ నిర్మాణం ఉండాలని సూచించారు. టెర్మినల్‌ భవనం ఎలివేషన్‌, డిపార్చర్‌, అరైవల్‌ బ్లాక్‌లు, ప్రయాణికుల లాంజ్‌లు ఇలా అన్ని నిర్మాణాల్లోనూ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా చూడాలన్నారు. కూచిపూడి నృత్యభంగిమ చిత్రాలు, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతులతో డిజైన్‌లు రూపొందించాలని చెప్పారు. నిర్దేశిత గడువులోగా వీటిని పూర్తి చేయాలన్నారు.


అమరావతి ఎయిర్‌పోర్టుకు భూ పరిశీలన: రామ్మోహన్‌ నాయుడు

కడప, రాజమండ్రి టెర్మినల్‌ భవన నిర్మాణాలకు సంబంధించిన పురోగతిని చంద్రబాబుకు రామ్మోహన్‌నాయుడు వివరించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం జిల్లా పలాస విమానాశ్రయాల టెక్నికల్‌ ఫీజిబిలిటీ రిపోర్టుపై పనిచేస్తున్నామని చెప్పారు. అమరావతి విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భూపరిశీలన జరుగుతోందని, దీనికి సంబంధించి రైట్స్‌ బృందం త్వరలోనే నివేదిక ఇస్తుందన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పక్రియ పూర్తయితే తదుపరి పనులు చేపడతామని చెప్పారు. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు విమానాశ్రయాల నుంచి దేశంలో వివిధ నగరాలకు కనెక్టివిటీని పెంచేందుకు ఆపరేటర్లు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు అక్టోబరు నుంచి సర్వీసులను నడిపేందుకు ట్రూజెట్‌ సంస్థ ముందుకు వస్తోందన్నారు. మరోవైపు విజయవాడ-సింగపూర్‌, తిరుపతి-మస్కట్‌ మధ్య కూడా త్వరలోనే విమాన సర్వీసులు కూడా మొదలు కానున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం వద్ద పెట్టుబడులకు ఖతార్‌ ఏవియేషన్‌ ఎండీ సిద్ధంగా ఉన్నారని వివరించారు.

Updated Date - Jun 12 , 2025 | 03:56 AM