Water Dispute: తుంగభద్రలో 80 టీఎంసీలకు మించొద్దు
ABN , Publish Date - May 25 , 2025 | 04:46 AM
తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది 80 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయరాదని నిర్ణయం తీసుకున్నారు. క్రస్ట్ గేట్ల దురవస్థ కారణంగా ముందు జాగ్రత్త చర్యలతో నీటిని దిగువకు వదిలే యోచనలో ఉన్నారు.

డ్యాంలో అంతకు మించితే దిగువకు వదిలేయాలి
క్రస్ట్ గేట్ల పరిస్థితితో ముందు జాగ్రత్తలు పాటించాలి
సీడబ్ల్యూసీ అధికారులు, కన్నయ్య నాయుడు సూచన
కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు ఈ ఏడాది లేనట్లే..!
బళ్లారి, మే 24(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం ఆయకట్టు రైతులకు ఇదో చేదు వార్త! కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు ఈ ఏడాది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దీంతో డ్యాంలో నీటి నిల్వలను 80 టీఎంసీలకు మించకుండా చూడాలని సీడబ్ల్యూసీ, క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డ్యాంలో నీటి నిల్వ 80 టీఎంసీలకు చేరగానే పై నుంచి వచ్చే వరద నీటిని నదిలోకి మళ్లించాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. డ్యాం క్రస్ట్ గేట్ల పరిస్థితి బాగాలేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 10న 19వ క్రస్ట్గేటు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. అప్పుడు డ్యాంలో 100 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా, వరద కూడా ఎక్కువగా ఉండేది. డ్యాం భద్రత దృష్ట్యా మిగిలిన 32 క్రస్ట్ గేట్లు తెరిచి లక్ష క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. ఆ తర్వాత 19వ క్రస్ట్గేట్ స్థానంలో స్టాప్లాగ్ ఏర్పాటు చేశారు. ఆపై వర్షాలు బాగా కురవడంతో డ్యాంలో నీటి నిల్వలు మళ్లీ 100 టీఎంసీలకు చేరాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఆ తర్వాత నిపుణులు పరిశీలించి, అన్ని క్రస్ట్గేట్లను మార్చాలని సూచించారు. వాటి ఏర్పాటు ఈ ఏడాది సాధ్యం కానందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
ఆయకట్టుకు ఇబ్బందులు
టీబీ డ్యాం గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు. జలాశయం కింద ఆంధ్ర, కర్ణాటక పరిధిలో 7,28,761 హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఆర్బీ హెచ్చెల్సీ కింద కర్ణాటక పరిధిలో 1,99,920 హెక్టార్లు, ఏపీ పరిధిలో 84,992 హెక్టార్లు, ఆర్బీ ఎల్లెల్సీ కింద ఏపీ పరిధిలో 1,35,443 హెక్టార్లు, కర్ణాటక పరిధిలో 92,678 హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఆయకట్టుకు సాగునీటితోపాటు డ్యాం నీటితో విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఈ ఏడాది గరిష్ఠ స్థాయిలో నీటినినిల్వ చేయకూడదని నిర్ణయించినందున సాగుకు ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారు. నీటి నిల్వలను 80 టీఎంసీలకు పరిమితం చేస్తే 25 టీఎంసీల కొరత ఏర్పడుతుంది. పూడిక కారణంగా మరో 5టీఎంసీల నిల్వ తగ్గిపోయింది. రుతుపవనాల ముందస్తు రాకతో ఇప్పటికే డ్యాంకు వరద మొదలైంది. మరో వారం పది రోజుల్లో తుంగ నది నుంచి వరద పెరగొచ్చని ఉందని డ్యాం వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి ఎత్తిపోతలు వద్దు
పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ
పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించడానికి వీలుగా ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ కోరింది. తెలంగాణలో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నా ఏపీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నదని, ఈ ఎత్తిపోతలతో గోదావరి డెల్టా సిస్టమ్ అవసరాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ మేరకు పీపీఏ, గోదావరి నది యాజమాన్య బోర్డు చైౖర్మన్కు తెలంగాణ ఈఎన్సీ(జనరల్) జి.అనిల్ కుమార్ శనివారం లేఖ రాశారు. పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టం 45.72మీటర్లుగా ఉండగా... 35 మీటర్ల నుంచి నీటిని తరలించడానికి వీలుగా ఎత్తిపోతలను ప్రతిపాదించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక, పోలవరం ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతినిస్తూ 2009లో 95వ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీకి వ్యతిరేకంగా ఈ ప్రతిపాదన ఉందని తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా డీపీఆర్ను గోదావరి బోర్డు మదింపు చేయాలని, ఏమాత్రం జాప్యం చేయకుండా ఈ ప్రాజెక్టును నిలువరించాలని కోరారు.