SIT Report: అది అసలు నెయ్యే కాదు
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:05 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలే బాబా డెయిరీది కీలకపాత్ర అని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్ నివేదించింది.

వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ సరుకు సరఫరా
పామాయిల్, కెమికల్స్,ఇతర ముడిపదార్థాలతో తయారీ
సరఫరాలో బోలే బాబా డెయిరీది కీలక పాత్ర: సిట్
ఏఆర్ డెయిరీని ముందుంచి తెరవెనుక వ్యవహారం
బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి
హైకోర్టులో సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలే బాబా డెయిరీది కీలకపాత్ర అని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్ నివేదించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఏఆర్ డెయిరీ ఎండీ రాజురాజశేఖరన్(ఏ2), బోలే బాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ3), విపిన్ జైన్(ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావడా(ఏ5) హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం వీటిపై విచారణ జరిగింది. సిట్ తరఫున సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ పీఎ్సపీ సురేశ్ కుమార్ వాదనలు వినిపించారు. నెయ్యి ఉత్పత్తి కోసం బోలే బాబా డెయిరీ అసలు పాలనే సేకరించలేదని రైతులు చెప్పారని తెలిపారు. పామాయిల్, కెమికల్స్, ఇతర ముడిపదార్థాలను వినియోగించి కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు సిట్ తన దర్యాప్తులో గుర్తించిందన్నారు. ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారమే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని వివరించారు. నెయ్యి సరఫరా కోసం టీటీడీతో ఏఆర్ డెయిరీ ఒప్పందం చేసుకున్నప్పటికీ, వెనుక ఉండి కథ మొత్తం నడిపించింది బోలే బాబా డెయిరీ అని పేర్కొన్నారు. బోలే బాబా డెయిరీని టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీని ముందు ఉంచి బోలే బాబా డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అశిష్ రోహిల్లా మేజిస్ట్రేట్ ముందు నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడగా, రోహిల్లాకు తెలియకుండానే ఆయన పేరు మీద ఇతర వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన రోహిల్లా మెయిల్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్లో ఉందన్నారు. మరోసాక్షి సంజయ్ జైన్ ఈ ఏడాది ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతికి రాగా ఎయిర్పోర్ట్ వద్ద కేసులోని నిందితుల బంధువులు అతనిపై దాడి చేసి బెదిరించారన్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్కు తీసుకెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెనక్కి పంపించారన్నారు.
అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. పిటిషనర్లు అందరూ ఆర్థికంగా బలవంతులని, కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించారని చెప్పారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులకు తీవ్ర ప్రమాదమన్నారు. నకిలీ నెయ్యి సరఫరా కుట్రకు సంబంధించి పత్రాలతో సహా పక్కా ఆధారాలు సేకరించామని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. అంతకుముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్రెడ్డి, శ్రీరామ్, మరో న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్లు గత నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారన్నారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలోని సిట్ ఇప్పటికే చార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించిందన్నారు. నెయ్యి సరఫరా గురించి టీటీడీతో ఏఆర్ డెయిరీ ఒప్పందం చేసుకుందని, వైష్ణవి, బోలే బాబా డెయిరీ డైరెక్టర్లకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంతో సంబంధం లేదని చెప్పారు. కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటామని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ పిటిషనర్ల తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు.