Drowning Accident: ప్రాణం తీసిన ఈత సరదా
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:47 AM
ఈత సరదా ముగ్గురు బాలుర ప్రాణాలను బలిగొంది. గుంటసీమలో ఇటీవల తవ్విన పంటకుంటలో మునిగి మృతిచెందారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ బిల్లాపుట్టుకు...

పంటకుంటలో మునిగి ముగ్గురు బాలురు మృతి
డుంబ్రిగుడ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఈత సరదా ముగ్గురు బాలుర ప్రాణాలను బలిగొంది. గుంటసీమలో ఇటీవల తవ్విన పంటకుంటలో మునిగి మృతిచెందారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ బిల్లాపుట్టుకు చెందిన గుంట సాయి కిరణ్(14), గుంట భాను తేజ్(14) వరుసకు అన్నదమ్ములు. తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తండ్రులు జీసీసీలో రోజువారీ కూలీలు. వేసవి సెలవులు కావడంతో వారం రోజుల క్రితం సాయికిరణ్, భాను తేజ్ గుంటసీమ పంచాయతీ గంగవలసలోని మేనమామ గొల్లోరి భాస్కరరావు ఇంటికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన కొర్రా సుశాంత్(14)తో కలిసి ఆదివారం గుంటసీమ గంగమయ్య గుడి సమీపానికి వెళ్లారు. అక్కడ ఉపాధి హామీ పథకంలో కొత్తగా నిర్మించిన పంటకుంటలో ఈత కొట్టేందుకు దిగారు. బంక మట్టితో ఊబిలా ఉండడంతో అందులో కూరుకుపోయి బయటకు రాలేక మృతి చెందారు. ఈ సంఘటన జరగడానికి అరగంట ముందు సాయి కిరణ్, భాను తేజ్ను అక్కడ చూసిన వారి మేనమామ పంటకుంటలో దిగవద్దని హెచ్చరించి ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి వాళ్లు కనిపించకపోవడంతో పంటకుంటలో దిగి ఉంటారని అనుమానించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలుర తల్లిదండ్రులు వచ్చి ఈతగాళ్లతో వెతికించారు.. దీంతో ముగ్గురు బాలుర మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణానదిలో మునిగి ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా పెదకాకాని ఏవీఎన్ కాలనీకి చెందిన రెండు కుటుంబాలకు చెందిన పది మంది బక్రీద్ పండుగ జరుపుకొని ఆదివారం సరదాగా గడిపేందుకు అమరావతి వచ్చారు. ఈ క్రమం లో కృష్ణానదిలో దిగిన సయ్యద్ ఖాదర్ వలీ(13), సయ్యద్ ఖాజా(23) మునిగిపోయారు. కుటుం బ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్య లు చేపట్టగాసాయంత్రానికి ఇద్దరిమృతదేహాలు లభ్యమయ్యాయి.